ఉగ్ర ఘాతుకం: ఆపిల్ వ్యాపారులపై కాల్పులు, ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
జమ్ముకశ్మీర్, పంజాబ్లో హై అలర్ట్ ప్రకటించిన కొద్దిసేపటికే ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులు చొరబడ్డారని ఐబీ వర్గాలు సమాచారం అందించిన సంగతి తెలిసిందే. కాగా కశ్మీర్ లోని సోపియన్ వద్ద గల ట్రెంజ్ వద్ద ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సాయుధలైన ఉగ్రవాదులు కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. పండ్ల వ్యాపారులపై తమ ప్రతాపం చూపించారు.
ఉగ్రవాదుల కాల్పుల్లో ఆపిల్ వ్యాపారి ఒకరు చనిపోయారు. చరణ్ జీత్ సింగ్ చనిపోగా.. సంజీవ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జమ్ము, పంజాబ్ రక్షణశాఖ స్థావరాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీచేసిన కొద్దిసేపటికే ఉగ్రవాదులు తెగబడటం కలకలం రేపింది. చుట్టుపక్కల ప్రాంతంలో అలజడి నెలకొంది.
రెండురోజుల క్రితం రాజస్థాన్ ట్రక్కు డ్రైవర్, ఓనర్ను కూడా ఉగ్రవాదులు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. వీరిలో ఒక ఉగ్రవాది పాకిస్థాన్కు చెందినవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పండ్ల వ్యాపారి కశ్మీర్ లోయ నుంచి ఫ్రూట్స్ తీసుకొస్తుండగా ఈ ఘటన జరిగింది. కశ్మీర్ విభజన జరిగిన తర్వాత దాదాపు 72 రోజుల అనంతరం ఈ ఘటన జరిగింది. కమ్యునికేషన్ వ్యవస్థను పునరుద్ధరించిన తర్వాత ఉగ్రవాదులు తెగబడ్డారు. దీంతో పరిస్థితిని పర్యవేక్షించేందుకు డీజీపీ దిల్ బాగ్ సింగ్ బుధవారం అనంతనాగ్ ప్రాంతాన్ని పరిశీలించారు.