జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్... లష్కరే కమాండర్ నసీర్ హతం...
జమ్మూకశ్మీర్లోని హంద్వారా జిల్లాలో భారత భద్రతా బలగాలు ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. హంద్వారాలోని గనిపొరా ప్రాంతంలో బుధవారం(అగస్టు 19) రాత్రి 9.30గం. ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. జమ్మూకశ్మీర్ పోలీసులు,భద్రతా బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. హతమైన ఇద్దరు ఉగ్రవాదుల్లో లష్కరే కమాండర్ నసీర్-ఉ-దిన్ లొన్ కూడా ఉన్నాడు. బారాముల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన మరుసటిరోజే మరో ఇద్దరినీ భద్రతా బలగాలు మట్టుబెట్టడం గమనార్హం.
ఈ ఏడాది ఏప్రిల్ 18న సొపొర్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లను,మే 4న హంద్వారాలో మరో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఘటనల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది నసీర్-ఉ-దిన్ లొన్ ప్రమేయం ఉంది.
కాగా,మంగళవారం బారాముల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ఉస్మాన్ అనే ఉగ్రవాదిని భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఏడాది జులైలో వసీమ్ బారిలో బీజేపీ నేత హత్య ఘటనలో ఉస్మాన్ ప్రమేయం ఉంది. అంతకుముందు సోమవారం కూడా భద్రతా బలగాలకు,ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు సహా జమ్మూకశ్మీర్కి చెందిన ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ మృతి చెందారు. ఈ దాడి అనంతరం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో లష్కరే తోయిబా టాప్ కమాండర్స్ సజద్ హైదర్, ఉస్మాన్ సహా మరో ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి. వీరి నుంచి ఏకె 47 రైఫిల్స్తో పాటు మూడు గన్స్ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.