ఉగ్ర ఏరివేతలో ఆర్మీ దూకుడు: మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకాశ్మీర్లో ఉగ్ర ఏరివేతలో భారత సైన్యం దూకుడు ప్రదర్శిస్తోంది. గురువారం తెల్లవారుజామున సోపోర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్ర ఏరివేతలో భారత సైన్యం దూకుడు ప్రదర్శిస్తోంది. గురువారం తెల్లవారుజామున సోపోర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూకాశ్మీర్ పోలీసులు నతీపోరాలో సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి.
బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత (గురువారం తెల్లవారుజామున 2.45గంటల సమయం) మొదలుపెట్టిన ఎదురుకాల్పులు ఉదయం వరకు కొనసాగాయి. హతమైన ఉగ్రవాదుల నుంచి 2 ఏకే47 రైఫిల్స్, 107 రౌండ్ల తూటాలు, రెండు పౌచ్లు, రూ.2వేల నగదు, రెండు రబ్బర్ స్టాంప్లను స్వాధీనం చేసుకున్నారు.
బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కారణంగా భారత సైన్యం ఉగ్రవాదులను మట్టుబెట్టగలుగుతోంది. ఇటీవల సబ్జార్ భట్ ఎన్ కౌంటర్లో కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ సహకరించింది. కొంతమంది స్థానికులు సైనికులకు అండగా నిలవడం వల్ల కూడా ఉగ్ర ఏరివేత కొంత వరకు తేలిగ్గా మారుతోందని భద్రతాదళ అధికారులు చెబుతున్నారు.