జనవరి నాటికి దేశంలో రెండు కరోనా వ్యాక్సిన్లు... ఎయిమ్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు...
జనవరి,2021 నాటికి దేశంలో రెండు కరోనా వ్యాక్సిన్లు ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి పొందే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ది చేస్తున్న ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకాకి చెందిన 'కోవీషీల్డ్'తో పాటు,భారత్ బయోటెక్ ఫార్మా అభివృద్ది చేస్తున్న కోవ్యాగ్జిన్ వచ్చే ఏడాది ప్రారంభం నాటికి అత్యవసర వాడకానికి అనుమతి పొందే అవకాశం ఉందన్నారు.ఒకవేళ ఈ వ్యాక్సిన్లు అనుమతి పొందితే... కరోనాతో ముందుండి పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు మొదట వ్యాక్సిన్ అందించే అవకాశం ఉందన్నారు.
Recommended Video
ఇటీవల వర్చువల్గా జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సిన్ గురించి ప్రస్తావించారు. 'దేశంలో దాదాపుగా 8 కరోనా వ్యాక్సిన్లు వివిధ అభివృద్ది దశల్లో ఉన్నాయి. భారత్లో తయారవుతున్న మూడు కరోనా వ్యాక్సిన్లు కూడా వివిధ అభివృద్ది దశల్లో ఉన్నాయి. వ్యాక్సిన్ వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని నిపుణులు చెప్తున్నారు. బహుశా మరికొద్ది రోజుల్లోనే భారత్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చు.' అని మోదీ పేర్కొన్నారు.
అమెరికా సంస్థ ఫైజర్, జర్మనీ సంస్థ బయోఎన్టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి ఇటీవలే బ్రిటన్ ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. పైజర్ వ్యాక్సిన్ సురక్షితమని బ్రిటన్ సంస్థ 'మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ' (ఎంహెచ్ఆర్ఏ) తెలిపింది. భద్రతా ప్రమాణాల విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా, టీకా సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆమోదం తెలిపినట్టు బ్రిటన్ వెల్లడించింది. టీకా అధ్యయనాల్లో ఫైజర్ 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడైందని పేర్కొంది. మొదట వైద్యులు,వయో వృద్దులకు ఈ వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించారు.
అటు రష్యా కూడా రాబోయే వారం నుంచి మాస్ వ్యాక్సినేషన్కి సిద్దమవుతోంది. ఇందులో భాగంగా మొదట దేశంలోని లక్ష మంది స్పుత్నిక్ వ్యాక్సిన్ అందించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే రెండు మిలియన్ల డోసుల స్పుత్నిక్ విని ఉత్పత్తి చేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.