ఉద్యోగులకు కేంద్రం గిఫ్ట్, జైట్లీ ఆఫర్ తిరస్కరించారు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న వారికి కేంద్రం వినాయక చవితికి ముందే పండుగ తెచ్చింది! 2014-15 నుంచి పెండింగ్లో ఉన్న బోనస్లను చెల్లించనున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం నాడు వెల్లడించారు.
ఈ రెండేళ్ల బోనస్ను సవరించిన నిబంధనల ప్రకారం 7వ వేతన సంఘ పరిధిలోకి తెస్తున్నట్లు తెలిపారు. రెండేళ్ల వార్షిక బోనస్ ను చెల్లించేందుకు కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో దాదాపు 33 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.
కాగా, 2013-14లో కేంద్ర ఉద్యోగులు బోనస్ను అందుకున్న అనంతరం ఈ రెండేళ్లూ వారికి ఎటువంటి బోనస్ రాలేదు.
జైట్లీ ఆఫర్ తిరస్కరించిన యూనియన్స్
బంద్ ఉపసంహరణ కోసం జైట్లీ ఇచ్చిన ఆఫర్ను పలు ట్రేడ్ యూనియన్స్ తిరస్కరించాయి. సెప్టెంబరు 2న బంద్ను ఉపసంహరించుకునేది లేదని తేల్చి చెప్పాయి. బంద్ ఉపసంహరణ కోసం వారి డిమాండ్లలో ఒకటైన తక్కువ నైపుణ్యం గల, వ్యవసాయేతర కార్మికుల రోజు వారీ కనీస వేతనం పెంచింది.
ప్రస్తుతం ఉన్న కనీస వేతనం రూ.246 నుంచి రూ.350కి పెంచడానికి ప్రభుత్వం అంగీకరించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండేళ్ల పెండింగ్ బోనస్ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే కార్మికుల మేజర్ డిమాండ్లేమీ ప్రభుత్వం పరిష్కరించలేదని, బంద్ వెనక్కి తీసుకునేది లేదని సీఐటీయూ వెల్లడించింది.
కార్మిక సంఘాలు గత ఏడాది సెప్టెంబరు నుంచి కనీస వేతన పెంపుతో పాటు ప్రధానంగా పన్నెండు డిమాండ్ల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాయి. అలాగే ఇన్సురెన్స్, రక్షణ తదితర కొన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడుల్లో నిబంధనల సడలింపును కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే విదేశీ పెట్టుబడుల అంశం గురించి ఆలోచించే ప్రస్తకే లేదని జైట్లీ తేల్చి చెప్పారు.