మహారాష్ట్ర : కదం తొక్కిన రైతులు.. 20వేల మందితో భారీ ర్యాలీ
జై జవాన్.. జై కిసాన్ అని గొప్పగా నినదిస్తాం. అటు జవాన్ కు కష్టాలే.. ఇటు రైతుకు కష్టాలే. సరిహద్దుల్లో జవాన్లు నిద్రాహారాలు మాని దేశాన్ని రక్షిస్తుంటే.. ఇటు జనావళికి కడుపు నింపే పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు రైతులు. అయితే రైతుల పట్ల, వారి సంక్షేమం పట్ల పాలకులకు చిత్తశుద్ధి లేకుండా పోయింది. ఎన్ని ఆందోళనలు చేసినా, నిరసనలకు దిగినా వారిని పట్టించుకునే నాథుడే లేడు.
మహారాష్ట్రలో అన్నదాతలు మరోసారి కదం తొక్కారు. రుణాలు మాఫీ చేయాలంటూ, కరువు పీడిత ప్రాంతాల రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు. దాదాపు 20వేలకు పైగా రైతులు కాలినడకన థానె నుంచి ముంబయికి బయలుదేరారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. గతంలో కూడా వేలాదిమంది అన్నదాతలు ముంబయిలో ఆందోళన నిర్వహించారు.
ప్రభుత్వం స్పందించకుంటే బైఠాయింపు.. ఎన్ని రోజులైనా అక్కడే
రుణాల మాఫీ, కరువు పీడిత ప్రాంతాల రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతూ రైతులు భారీ ర్యాలీ తలపెట్టడం చర్చానీయాంశంగా మారింది. పదులు, వందల సంఖ్యలో కాదు ఆందోళన తలపెట్టిన రైతుల సంఖ్య 20వేలకు పైగా ఉండటంతో అందరి చూపు ఇటువైపు మళ్లింది. బుధవారం ఉదయం 10 గంటలకు థానె నుంచి బయలుదేరిన అన్నదాతలు సాయంత్రం 5 గంటలకు ముంబయిలోని సోమయ్య మైదానానికి చేరుకుంటారు. గురువారం ఆజాద్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు. దీంతో వీరు తలపెట్టిన ర్యాలీ ముగుస్తుంది. అయితే డిమాండ్లు సాధించుకునేవరకు అక్కడే బైఠాయిస్తామని ప్రకటించారు.
అన్నదాతలకు అండగా..
రైతన్నల పోరాటానికి స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్, నీటి పరిరక్షణ కార్యకర్త రాజేంద్ర సింగ్ తోడయ్యారు. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు అండగా ఉంటామని ప్రకటించారు. లోక్ సంఘర్ష్ మోర్చా ప్రతినిధులు ముందుండి ఈ ర్యాలీని నడిపిస్తున్నారు. పొలాల్లో ఉండాల్సిన రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు లోక్ సంఘర్ష్ మోర్చా జనరల్ సెక్రటరీ ప్రతిభా షిండే. మహారాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
రైతుల ఆందోళనతో అధికారులు అలర్ట్
అన్నదాతలు తలపెట్టిన నిరసన కార్యక్రమంతో మహారాష్ట్ర అధికారులు అలర్టయ్యారు. బుధవారం సాయంత్రం ముంబైలో వీరి ర్యాలీ అడుగుపెట్టనుండటంతో ట్రాఫిక్ జామ్ తదితర పరిణామాలపై దృష్టి సారించారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆజాద్ గ్రౌండ్స్ లో అంతమంది రైతులు బైఠాయిస్తే చాలా సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. ఈమేరకు పోలీస్ ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
రైతులకు మొండిచేయి..!
ఇలాంటి ఆందోళన ఈసారే కొత్త కాదు. గతంలో కూడా జరిగింది. మార్చి నెలలో దాదాపు 50వేల మంది రైతులు రోడ్డెక్కారు. నాసిక్ నుంచి కాలినడకన ముంబయికి చేరుకున్నారు. అయితే అన్నదాతలు ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం దిగిరావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు సోషల్ వర్కర్స్.