మధ్యప్రదేశ్లో పేలుడు: 82 మంది దుర్మరణం
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి 82 మంది దుర్మరణం పాలు కాగా, 85 మంది దాకా గాయపడ్డారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రలోని జబువాలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరగవచ్చునని భావిస్తున్నారు.
ఓ హోటల్లో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తున్నారు. భవనం కుప్పకూలింది. వంట చేసే సమయంలో ఈ ప్రమాదం సంభవించిందా, గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ప్రమాదం జరిగిందా అనేది తెలియడం లేదు.
పేలుడు శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో జరిగింది. జుబవాకు 60 కిలోమీటర్ల దూరంలో గల పెట్లవాడ్ పట్టణంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. శిథిలాల కింద మరికొంత మంది ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి పక్కన ఉన్న భవనాలు కూడా బీటలు వారాయి.
సహాయక చర్యల కోసం అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అంతర్ సింగ్ ఆర్యా సంఘటనా స్థలానికి బయలుదేరారు.