సూరత్ ప్రమాదానికి కారణమెవరు ? ఎవరి నిర్లక్ష్యం 20 మంది విద్యార్థులను బలితీసుకుంది ?
సూరత్ : సూరత్ కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాద మృతుల సంఖ్య పెరుగుతుంది. 20 మంది విద్యార్థులు చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. మృతులంతా టీనేజర్లని .. కొందరు ఊపిరాడక మృతిచెందారని గుజరాత్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సూరత్లోని సర్తానా ప్రాంతంలో గల తక్షిశిల కోచింగ్ సెంటర్లో నిన్న ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.\
షార్ట్ సర్క్యూటే కారణమా ?
ప్రమాదం జరిగాక మూడో అంతస్థు నుంచి విద్యార్థులు దూకిన వీడియోలు భయభ్రాంతులకు గురిచేసింది. గుజరాత్ మీడియా ప్రతినిధి వీడియో తీసి సోషల్ మీడియా ట్విట్టర్లో షేర్ చేయడంతో వైరలైంది. కోచింగ్ సెంటర్ లో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. బిల్డింగ్ లో మూడో అంతస్తులో కోచింగ్ సెంటర్ ఉండగా .. గ్రౌండ్ ప్లోర్ నుంచి మంటలు వ్యాపించినట్టు అధికారులు గుర్తించారు. ఆ భవనంలో నిర్మాణ తీరును కూడా పరిశీలిస్తున్నామని .. అవకతవకలకు పాల్పడి నిర్మిస్తే చర్యలు తప్పవని గుజరాత్ సీఎం రూపానీ హెచ్చరించారు.
19 ఫైరింజన్లు ..
ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి 19 ఫైరింజన్లు చేరుకొని మంటలను ఆర్సివేశాయి. గంటల్లోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో కోచింగ్ సెంటర్ లో 50 మంది విద్యార్థులు ఉన్నారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. మంటలు ఎగిసిపడటంతో దాదాపు 10 మంది విద్యార్థులు కిందకి దూకారని తెలుస్తోంది. అంటే 20 మంది చనిపోగా .. మరో 20 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడమే గాక .. సహాయం కూడా అందించడంతో మిగతా చోట్లకు అగ్నికీలలు ఎగిసిపడే ప్రమాదం తప్పింది.
ఉపేక్షించం ..
ప్రమాదంపై సీఎం విజయ్ రుపానీ విచారణకు ఆదేశించారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.4 లక్షలు అందజేస్తామని ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. బీజేపీ చీఫ్ అమిత్ షా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.