ఏటా 7లక్షల మందిని చంపేస్తున్నారు..! ఉగ్రవాదులు కాదు? మరెవరు?
ఈ రోజుల్లో ప్రతి వస్తువుకు నకిలీ పుట్టుకొస్తోంది. తినే తిండి నుంచి వాడే మందుల దాకా సర్వం కల్తీమయమైపోయాయి. డాక్టర్ రాసిచ్చే మందులు వ్యాధిని నయం చేసేవే అయినా మెడికల్ షాపుల్లో దొరికే మెడిసిన్స్ అసలైనవి అవునా కాదా తెలియడం లేదు. నకిలీ మందులు వేసుకుంటే వ్యాధులు తగ్గకపోగా.. కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా అమెరికా వెల్లడించిన స్పెషల్ 301 రిపోర్ట్ ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. నకిలీ మందుల తయారీతో కంపెనీలు ఏటా 7 లక్షల మందిని చంపేస్తున్నాయని చెప్పింది.
20శాతం నకిలీ మందులు
ఫార్మా ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. 2020 నాటికి దేశ ఫార్మా విలువ 4లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఫార్మా సిటీ ఆఫ్ ది వరల్డ్గా పేరున్న భారత్ పేరును కొన్ని నకిలీ మందులు తయారుచేస్తున్న సంస్థలు చెడగొడుతున్నాయి. ఫేక్ మెడిసిన్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయి. తాజాగా యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) వెల్లడించిన స్పెషల్ 301 రిపోర్ట్లో భారత్లో 20శాతం మందులు నకిలీవేనని స్పష్టం చేసింది.
నకిలీ మందులకు ఏటా 7లక్షల మంది బలి
అమెరికా, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికా, సౌతాఫ్రికా, కెనడాలకు భారత్ నకిలీ మందులు అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఫేక్ మెడిసిన్స్తో ఇండియాతో పాటు చైనా, ఇండోనేషియా, థాయ్లాండ్ దేశాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని స్పెషల్ 301 రిపోర్టు ఆరోపించింది. ఆన్లైన్లోనూ నకిలీ ఔషధాల అమ్మకం ఎక్కువైనందని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మందుల వల్ల ఏటా 7లక్షల మంది మృతి చెందుతున్నారని ఇంటర్నేషనల్ పాలసీ నెట్వర్క్ ప్రకటించింది.
అమెరికావి తప్పుడు లెక్కలు
అమెరికా విమర్శలను కేంద్ర ఆరోగ్య, సంక్షేమ శాఖ కొట్టి పారేస్తోంది. అగ్రరాజ్యం తప్పుడు లెక్కలు చూపిస్తోందని మండిపడింది. ఇండియాలో నకిలీ మందుల సమస్య ఉన్న మాట వాస్తవమే అయినా అది మొత్తం మందుల్లో కేవలం 10శాతం మాత్రమేనని అంటోంది. ఫేక్ మెడిసిన్స్కు చెక్ పెట్టేందుకు బ్లాక్ చెయిన్, క్యూఆర్ టెక్నాలజీ వాడుతున్నామని స్పష్టం చేసింది.
ఎఫ్ఎస్డీఏ అధ్యయనం
గతంలో ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చేసిన అధ్యయనంలో దేశంలో 10శాతం నకిలీ మందులు ఉన్నాయని తేలింది. మార్కెట్లో ఉన్న మందుల్లో 38శాతం లో క్వాలిటీకి చెందినవని ప్రకటించింది. 2015లో ఎఫ్ఎస్డీఏ ఉత్తర్ప్రదేశ్లో 5,150 కాస్మొటిక్ ప్రొడక్ట్స్ను లాబ్లలో పరిశీలించగా.. వాటిలో 4,723 ప్రొడక్ట్స్ నాణ్యత నాసిరకంగా ఉందని, మరో 506 ఉత్పత్తులు నకిలీవని తేలింది.
ప్రభుత్వాసుపత్రుల్లో నకిలీల బెడద
మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాల మేరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ 2014 -16మధ్యకాలంలో ఓ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, ఫార్మసీల నుంచి 47వేల 954 రకాల మందుల శాంపిళ్లు సేకరించింది. వాటిని ల్యాబొరేటరీల్లో పరీక్షించగా... ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇచ్చే మందుల్లో 10శాతం నకిలీవేనని, రోగాల నివారణలో అవి ఏమాత్రం పనిచేయవని తేలింది.