200కోట్ల స్కాం: పంకజముండే కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ
ముంబై: మహారాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజ ముండే మీద ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఒక మహిళ మంత్రిగా ఉంటూ రూ.200 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. చిన్న పిల్లలకు కేటాయించిన నిధులు దుర్వినియోగం చేశారని అంటున్నారు.
మహారాష్ట్రలోని ప్రభుత్వ పాఠశాలలలో విద్యాభ్యాసం చేస్తున్న గిరిజన విద్యార్థులకు పుస్తకాలు, వాటర్ ఫిల్టర్లు కొనుగోలు చెయ్యడానికి నిధులు మంజూరు చేశారు. పుస్తకాలు, వాటర్ ఫిల్టర్లు కొనుగోలు చేసే విషయంలో ఎలాంటి నియమాలు పాటించలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
మహారాష్ట్రలో ఇది ఒక పెద్ద కుంభకోణం అని మండిపడింది. అక్రమంగా ఆన్ లైన్ టెండర్లు పిలిచి, వారికి కావలసిన వారితో ఆ వస్తువులు కొనుగోలు చెయ్యడం వలన మంత్రి పంకజ ముండేకి రూ.200 కోట్ల ముడుపులు ముట్టాయని, మా దగ్గర అన్ని సాక్షాలు ఉన్నాయని, వాటిని బయటపెడుతామని కాంగ్రెస్ ఆంటోంది.
అయితే రూ.ఒక లక్ష కంటే ఎక్కువ మొత్తంలో ఏవైనా వస్తువులు కొనుగోలు చెయ్యాలంటే టెండర్లు పిలవాలని తాము గతంలోనే ఆదేశాలు జారీ చేశామని మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సుధీర్ ముంగన్ తివార్ అంటున్నారు. ఈ విషయంపై మంత్రి పంకజ ముండే స్పందించవలసి ఉంది. బీజేపీ అగ్రనేతగా ఒక వెలుగు వెలిగిన దివంగత గోపినాథ్ ముండే కుమార్తె పంకజ ముండే.