దీపావళి వేడుకల్లో అపశృతి .. దేశ రాజధానిలో భారీగా అగ్ని ప్రమాదాలు..!
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి వేడుకలు కొంత విషాదం మిగిల్చాయి. టపాసుల మోతతో కొన్ని చోట్ల భారీగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. పండుగ సందర్భంగా అపశృతి జరగడంతో ఢిల్లీ వాసుల్లో ఆందోళన కనిపించింది. సదర్ బజార్లోని ఒక దుకాణంలో అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు వ్యాపించాయి. అయితే ఢిల్లీలో పండుగ పూట అగ్ని ప్రమాదాలకు సంబంధించి రెండు వందలకు పైగా ఫైర్ యాక్సిడెంట్లు జరిగినట్లు ఫోన్లు వచ్చాయని ఢిల్లీ అగ్నిమాపక విభాగం అధికారులు సోమవారం నాడు మీడియాకు వివరించారు.
శనివారం రాత్రి మొదలు ఆదివారం రాత్రి వరకు జరిగిన ఫైర్ యాక్సిడెంట్లకు సంబంధించి 245 ఫోన్లు వచ్చాయని.. అదే సోమవారం ఉదయం 10 గంటల వరకు మరో వంద కాల్స్ వచ్చినట్లు తెలిపారు. అయితే ఇన్ని ఘటనలు జరిగినప్పటికీ ఎవరికీ ప్రాణహాని జరగలేదని తెలుస్తోంది. అయితే ఆయా ఫోన్ కాల్స్ ప్రకారం అగ్ని మాపక సిబ్బంది స్పందించారని.. హుటాహుటిన ఘటన స్థలాలకు వెళ్లి మంటలు అదుపులోకి తెచ్చారని అధికారులు వెల్లడించారు. సదర్ బజార్లోని ఒక ఎత్తైన భవనంలో 5వ అంతస్థులో ఉన్న దుకాణంలో మంటలు చెలరేగి ప్లాస్టిక్ సామాగ్రి తగలబడిందని.. ఆ క్రమంలో చుట్టుపక్కల మంటలు బాగా వ్యాపించాయని.. తమ సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలు ఆర్పినట్లు తెలిపారు.
పొదుపు మాట దేవుడెరుగు.. కొంప ముంచిన గోల్డ్ స్కీమ్..!
దీపావళి నాడు 200కు పైగా అగ్ని ప్రమాదాలు జరగడం వెనుక అసలు కారణాలు ఇంకా నిర్ధారించలేదు అధికారులు. అదలావుంటే బాణసంచా కాల్చడంపై ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ చాలామంది తుంగలో తొక్కినట్లు స్పష్టమైంది. రాత్రి 10 గంటల వరకే బాణసంచా కాల్చడానికి ఢిల్లీ అధికార యంత్రాంగం పర్మిషన్ ఇచ్చింది. అయితే చాలా ప్రాంతాల్లో కూడా అర్ధరాత్రి వరకు టపాసుల మోత మోగినట్లు తెలుస్తోంది. దాంతో ఈ అగ్ని ప్రమాదాలు జరిగాయా లేదంటే ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.