న్యాయం కోరుతూ కోర్టుకెక్కిన 200 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లు
తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, న్యాయం చెప్పాలంటూ దాదాపు 200 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లు కోర్టుకెక్కారు.
బెంగళూరు: బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న దాదాపు 200 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) జవాన్లు కోర్టుకెక్కారు.
ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసినా ప్రయోజనం లేకపోవడంతో.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వారు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తమకు సరైన తిండి పెట్టడం లేదని, అలవెన్సులు చెల్లించడం లేదని, పేరుకే అంతర్జాతీయ విమానాశ్రయం.. కానీ ఇకడ పని చేసే పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని, తమకు న్యాయం చేయాలంటూ వారు తమ పిటిషన్ లో కోరారు.
విమానాశ్రయాలతోపాటు ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల భద్రతా బాధ్యతలను సీఐఎస్ఎఫ్ సిబ్బంది చూసుకుంటారు. కేంద్ర భద్రతా దళాలలో భాగమైన సీఐఎస్ఎఫ్ తో పాటు వివిధ దళాలు తీవ్ర ఒత్తిడి నడుమ పనిచేస్తున్నాయి.
గత మూడేళ్లలో 344 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లు వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే 15 మంది ఇలా అసువులు బాశారు. పని వాతావరణం దుర్భరంగా ఉండటం, తీవ్రమైన ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు.. ఇలా రకరకాల కారణాలతో సీఐఎస్ఎఫ్ జవాన్లు అర్థంతరంగా తనువు చాలిస్తున్నారు.