పీఎన్బీ స్కామ్ సంచలనాలు: వాళ్లకూ ముడుపులు?, సోదాల్లో ఏం తేలింది?
న్యూఢిల్లీ: బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి దాదాపు రూ.11వేల కోట్ల కుంభకోణానికి తెరదీసిన నీరవ్ మోడీ కంపెనీల గుట్టు రట్టు చేస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. నీరవ్ మోడీ సంస్థలతో పాటు ఆయన మేనమామ మెహుల్ ఛోక్సీ ఆధ్వర్యంలోని గీతాంజలి గ్రూప్కు అనుబంధంగా ఉన్న 18 సంస్థల బ్యాలెన్స్ షీట్లను సీబీఐ నిశితంగా పరిశీలిస్తోంది.
Recommended Video
బ్యాంకుల నుంచి ఈ సంస్థలకు డబ్బు ఎలా మళ్లించారు?.. కేవలం 24 గంటల్లోనే నీరవ్ ఎల్ఓయూలను బ్యాంకులు ఎలా క్లియర్ చేశాయి? వంటి ప్రశ్నలపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.
బయటపడ్డ మరో స్కామ్: బ్యాంకుల నుంచి రూ.800కోట్లు స్వాహా!, దేశం నుంచి 'జంప్'
200 డబ్బా కంపెనీలుఫ
నీరవ్ మోడీ సంస్థల గుట్టు రట్టు చేసేందుకు ఈడీ, ఐటీ శాఖల అధికారులు ఒక బృందంగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
నీరవ్ మోడీకి సంబంధించి దాదాపు 200 షెల్(నకిలీ) కంపెనీలు, బినామీ ఆస్తుల్ని ఇప్పటికీ ఈ సంస్థలు గుర్తించినట్టు తెలుస్తోంది.భారత్తో పాటు విదేశాల్లో ఉన్న ఈ కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు జరిపారన్న నిర్దారణకు వచ్చినట్టు తెలుస్తోంది.
105అకౌంట్స్ బ్లాక్:
అక్రమ లావాదేవీలతో కూడబెట్టిన డబ్బును స్థలాలు, బంగారం, డైమండ్స్ రూపంలో బినామీ ఆస్తులుగా మార్చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఐటీ శాఖలు ధ్రువీకరించినట్టుగా సమాచారం. ఇప్పటిదాకా నీరవ్కు చెందిన 105 బ్యాంకు అకౌంట్లను దర్యాప్తు సంస్థలు స్తంభింపచేసినట్టు ఈడీ అధికారి ఒకరు తెలిపారు.
45బ్రాంచుల్లో సోదాలు..:
వరుసగా నాలుగోరోజైన ఆదివారం కూడా ఢిల్లీ, బెంగళూరు సహా అన్ని నగరాల్లోని మోడీ, చోక్సీల ఆస్తులపై ఈడీ దాడులు కొనసాగాయి. దేశవ్యాప్తంగా 15 నగరాల్లోని 45 చోట్ల జ్యువెలరీ షాప్స్, తయారీ కేంద్రాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. సోదాల్లో రూ. 20 కోట్ల మేర వజ్రాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
రాయ్పూర్లోని 4గీతాజంలి డైమండ్ షోరూమ్స్లో, బెంగళూరులో 10, ఢిల్లీలో 7, ముంబై, కోల్కతాల్లో 5, చండీగఢ్, హైదరాబాద్ల్లో 4, పట్నా, లక్నో, అహ్మదాబాద్, చెన్నై, గువాహటి, శ్రీనగర్, గోవా, జైపూర్, జలంధర్లలోని బ్రాంచుల్లో సోదాలు నిర్వహించారు.
24గం.ల్లోనే ఎల్ఓయూ?..
బ్యాంకుల సిబ్బందికి తెలియకుండా ఇంత పెద్ద కుంభకోణం జరిగే ఆస్కారం లేదని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఎల్ఓయూల విషయంలో నిబంధనలు పాటించకపోవడం.. అది జారీ అయిన వెను వెంటనే విదేశాల్లోని ఇతర భారతీయ బ్యాంకుల బ్రాంచీలు నీరవ్ మోడీకి సొమ్ము అందజేయడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. కేవలం 24గం.ల్లోనే నీరవ్ ఎల్ఓయూలను క్లియర్ చేయడం వెనుక ఏం జరిగి ఉంటుందన్న దానిపై ఆరా తీస్తున్నాయి.
సిబ్బందికి ముడుపులు ముట్టాయా?:
నీరవ్ మోడీ కంపెనీలకు జారీ అయ్యే ప్రతీ ఎల్ఓయూలో బ్యాంకు సిబ్బంది వాటాలను పంచుకున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
ఎల్ఓయూ కింద ముట్టే కమీషన్ను బ్యాంకు ఉద్యోగులంతా పంచుకున్నారని సీబీఐ విచారణలో తేలినట్టు తెలుస్తోంది. నీరవ్ నుంచి బ్యాంకు స్టాఫ్ కు ప్రత్యక్షంగా ఏమైనా బహుమతులు లేదా ప్రలోభాల పర్వం కొనసాగిందా అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.