2000 నోట్లు పుష్కలం.. రద్దు చేసే యోచన లేదు..!
ఢిల్లీ : 2వేల రూపాయల నోట్లు క్రమేణా రద్దవుతాయంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు ఆర్థికశాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్. 2వేల రూపాయల నోట్ల ముద్రణ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించారు. నోట్ల ముద్రణ క్రమంగా తగ్గుతూ.. కనిపించకుండా పోతాయనే వార్తలొచ్చిన నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. 2వేల రూపాయల నోట్లు దాదాపు 35 శాతం చలామణీలో ఉన్నట్లు తెలిపారు. అవసరమైనదానికంటే అవి ఎక్కువే ఉన్నట్లు చెప్పారు.
2000 నోట్ల ముద్రణను రిజర్వ్ బ్యాంక్ కనిష్ఠ స్థాయికి తగ్గించిందని గురువారం నాడు ఆర్థికశాఖ ఉన్నతాధికారి వెల్లడించారు. దీంతో కేంద్రం 2వేల నోటుకు మంగళం పాడబోతుందనే వార్త వైరల్ గా మారింది. అయితే అది నిజం కాదంటూ శుక్రవారం ఆర్థికశాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ స్పష్టతనిచ్చారు.
ఇప్పటికి చలామణీలో ఉన్న నగదుపై కేంద్రం, ఆర్బీఐ సమీక్ష నిర్వహించి ఎంతమేర కొత్త నోట్లు ముద్రించాలనేదానిపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అందుకే 2వేల రూపాయల నోట్ల ముద్రణను కొంతమేర తగ్గించినట్లు తెలిపారు. 2000 నోట్లకు ఢోకా లేదని.. అవసరాన్ని బట్టి ముద్రిస్తామని వివరించారు.