2008 జైపూర్ బాంబు పేలుళ్లు: నలుగుర్ని దోషిగా తేల్చిన కోర్టు, నిర్దోషిగా ఒకరు
జైపూర్: 2008లో జరిగిన జైపూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురిని దోషులుగా తేలుస్తూ జైపూర్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరొక నిందితుడ్ని నిర్దోషిగా ప్రకటించింది.
2008 మేలో జైపూర్లో ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ వరుస బాంబు పేలుళ్లకు పాల్పడింది. ఈ పేలుళ్లలో సుమారు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మందికిపైగా గాయపడ్డారు.
మొదట హవామహల్ వద్ద పేలుడు సంభవించింది. ఐదు నిమిషాల తర్వాత మరో ప్రాంతంలో బాంబు పేలుడు జరిగింది. సుమారు ఏడు చోట్ల ఉగ్రవాదులు బాంబు దాడులకు పాల్పడ్డారు. ఎక్కువగా పేలుళ్లు హనుమాన్ ఆలయాల వద్దే జరగడం గమనార్హం.
ఈ కేసుకు సంబంధించి 2018 ఫిబ్రవరిలో ముజాహిదీన్ ఉగ్రవాది అరిజ్ ఖాన్ అలియాస్ జునైద్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ బాంబు దాడికి పాల్పడిన మరో ఇద్దరిని 2008లోనే ఎన్కౌంటర్ చేశారు. 12ఏళ్లపాటు కొనసాగిన విచారణ అనంతరం జైపూర్ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది.