నిర్భయ దోషులకు మరణశిక్ష: కోర్టు తీర్పుపై నిర్భయ తల్లిదండ్రులు ఏమన్నారంటే..?
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన 2012 నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఢిల్లీ కోర్టు దోషులకు ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. దోషులకు జనవరి 22న ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరితీయాలని పాటియాల హౌస్ కోర్టు ఆదేశించింది. అయితే, ఈ 14 రోజుల్లో దోషులు తమ న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవచ్చునని వెల్లడించింది.
ఎట్టకేలకు న్యాయం జరిగిందంటూ నిర్భయ తల్లి..
కాగా, కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి ఆశా దేవి హర్షం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు తన కూతురుకు న్యాయం జరిగిందని అన్నారు. నలుగురు దోషులకు మరణశిక్ష విధించడంతో దేశంలోని మహిళల సాధికారతను పెంపొందిస్తుందని చెప్పారు. న్యాయ వ్యవస్థపై దేశ ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఈ తీర్పు మరోసారి బలపర్చిందని అన్నారు.తన జీవితంలో ఇదే పెద్ద విషయమని అన్నారు.
భయం కలగాలంటూ నిర్భయ తండ్రి..
నిర్భయ దోషులకు కోర్టు ఉరిశిక్ష విధించడంపై ఆమె తండ్రి బద్రీనాథ్ సింగ్ సంతోషంగా వ్యక్తం చేశారు. మహిళలపై ఇలాంటి నేరాలకు పాల్పడే దుర్మార్గులకు ఈ తీర్పు భయాన్ని కలిగిస్తుందని అన్నారు. జనవరి 22న ఉదయం 7గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలవుతుందని చెప్పారు.
స్వాగతించిన స్వాతి మలీవాల్
నిర్భయ దోషులకు ఢిల్లీ కోర్టు మరణశిక్ష విధించడాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మలీవాల్ స్వాగతించారు. దేశంలో నివసిస్తున్న నిర్భయలందరు ఈ తీర్పుతో గెలిచారన్నారు. ఏడేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న నిర్భయ తల్లిదండ్రులకు ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో దోషులకు శిక్ష విధించేందుకు ఏడేళ్ల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు.
ఇలాంటి నేరాలకు పాల్పడేవారిని క్షమించేది లేదు..
2012 ఢిల్లీ సామూహిక అత్యాచారం, హత్య కేసులో న్యాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు నేటి కోర్టు తీర్పు ముగింపు పలికింది. ఇది దోషులకు మరణశిక్ష విధించడమే కాదు... ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని క్షమించేది లేదనే సందేశాన్ని న్యాయస్థానం ఇచ్చిందని అన్నారు. ఈ తీర్పు ఇప్పటికే రావాల్సిందని అభిప్రాయపడ్డారు.