దేశం నేరాల చిట్టా విడుదల: రోజుకు సగటున 80 హత్యలు, 90 మానభంగాలు 289 కిడ్నాప్లు
న్యూఢిల్లీ: దేశంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతోంది. ఏ పేపర్ తిరిగేసినా, ఏ వార్తా ఛానెల్ చూసిన దేశంలో ఏదో ఒక మూలాన అత్యాచార ఘటనలు, కిడ్నాప్ ఘటనలు, హత్యా ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇక 2018 సంవత్సరంలో జరిగిన క్రైమ్ రిపోర్టును నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో ఒక నివేదిక తయారు చేసింది. 2018 సంవత్సరంలో రోజుకు సగటున 80 హత్యలు, 91 మానభంగాలు, 289 కిడ్నాప్లు జరిగాయని వెల్లడించింది. 2017తో పోలిస్తే 2018లో క్రైమ్ రేట్ 1.8 శాతం పెరిగిందన్నారు.
2018లో 50.74 లక్షల నేరాలు
2018లో దేశవ్యాప్తంగా 50.74 లక్షల నేరాలు జరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 31.32 లక్షలు ఐపీసీ సెక్షన్ కింద కేసులు నమోదు చేయడం జరిగిందని నివేదికలో పొందుపర్చింది. 2017తో పోలిస్తే 2018లో నేరాల శాతం పెరగిందని వెల్లడించింది. లక్ష జనాభాకు క్రైమ్ రేట్ చూసుకుంటే కాస్త తగ్గిందని పేర్కొంది. అంటే 2017లో లక్ష జనాభాకు క్రైమ్ రేట్ 388.6 ఉండగా 2018లో 383.5గా ఉన్నట్లు పేర్కొంది.
2009తో పోలిస్తే 10శాతం పెరిగిన కిడ్నాప్లు
ఇక 2018లో కిడ్నాప్ కేసులు 1.05 లక్షలుగా నమోదయ్యాయని లెక్కగట్టిన ఎన్సీఆర్బీ 2017తో పోలిస్తే 10శాతం పెరుగుదల కనిపించిందని స్పష్టం చేసింది. 2017లో 95,893 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. ఇక హత్య కేసులు కూడా 2018లో పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 1.3శాతం మేరా హత్య కేసులు నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 29,017 మర్డర్ కేసులకు సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీలో దోపిడీలు, దొంగతనాల కేసులే ఎక్కువ
ఇక దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీలు లూటీలే ఎక్కువగా జరిగినట్లు నేషనల్ క్రైమ్ర్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి. 2018లో నమోదైన అన్ని కేసులను పరిశీలిస్తే ఎక్కువగా దోపిడీ, దొంగతనాల కేసులే ఉన్నాయని ఎన్సీఆర్బీ పేర్కొంది. ఇవి దాదాపు 80శాతంగా ఉన్నట్లు తెలిపింది. జనవరి 2018 నుంచి డిసెంబర్ 2018 వరకు ఢిల్లీలో 2,49,000 కేసులు నమోదయ్యాయి. 2009లో ఢిల్లీలో దోపిడీల శాతం 40శాతంగా ఉంటే 2018కి అది రెట్టింపై 80శాతానికి చేరుకుందని లెక్కలు తెలిపాయి.
మహిళలు బాలికలపై పెరిగిన లైంగిక వేధింపులు
మహిళలపై బాలికలపై సంరక్షణ కేంద్రాల్లో లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని నివేదిక వెల్లడించింది. 2018కి గాను 30శాతం పెరిగాయని పేర్కొంది. ఇందులో చాలావరకు కేసులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ విచారణ చేస్తోందని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా బీహార్లోని ముజఫర్పూర్ సంరక్షణ కేంద్రంలో బాలికలపై జరిగిన లైంగిక వేధింపులను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రస్తావించింది.