రివ్యూ పిటిషన్లను కొట్టివేయండి...డిసెంబర్ తీర్పునే కొనసాగించండి: సుప్రీంలో కేంద్రం అఫిడవిట్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుల్లో రాఫెల్పై రివ్యూ పిటషన్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా కేంద్రం ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రధాని కార్యాలయం రాఫెల్ యుద్ధ విమానాలపై సమాంతర చర్చలు జరపడాన్ని మరో రకంగా చూడరాదని పేర్కొంటూ దీనిపై దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని విచారణ నిలిపివేయాలని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు అంశంలో దాఖలైన రివ్యూ పిటిషన్లను కొట్టివేయాలంటూ రెండు అఫిడవిట్లు దాఖలు చేసింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన విషయాలు బయటపెడితే దేశభద్రతకు ముప్పువాటిల్లే అవకాశం ఉందని పేర్కొంది.
ఏప్రిల్ 10న లీకైన రహస్య డాక్యుమెంట్లను విచారణ చేస్తామన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపింది కేంద్రం. సీక్రెట్ డాక్యుమెంట్లను విచారణ చేస్తే అది దేశభద్రతకు ముప్పు వాటిల్లుతుందని అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఇబ్బందుల్లోకి నెట్టినట్లు అవుతుందని పేర్కొంది. రాఫెల్ జెట్లను తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నామని కోర్టు దృష్టికి కేంద్రం తీసుకొచ్చింది. డిసెంబర్ 2018న ఇచ్చిన తీర్పునే కోర్టు కొనసాగించాలని కోరింది. ఆ సమయంలో రాఫెల్ కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీనిపైనే పలు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి.
ఇదిలా ఉంటే రివ్యూ పిటిషన్లను విచారణ చేసిన సుప్రీంకోర్టు మే 4కల్లా కేంద్రం తన స్పందన తెలియజేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. స్పందన తెలియజేసేందుకు నాలుగు వారాలు సమయం కేంద్రం కోరగా అందుకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నిరాకరించారు. శనివారం నాటికల్లా స్పందన తెలియజేయాలంటూ జస్టిస్ రంజన్ గొగోయ్ కేంద్రాన్ని ఆదేశించారు. గతేడాది డిసెంబర్ 14న మాజీ కేంద్రమంత్రులు అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హా, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్లు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. వీరితో పాటుగా ఆప్ నేత రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంజయ్ సింగ్ కూడా ప్రత్యేక రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.