నాడు మోడీకి జై కొట్టిన వారే నేడు నై అంటున్నారు.. రాహుల్ పరిస్థితి ఏంటి..?
సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే ఏప్రిల్ నెలలో అవినీతిపై పోరుకు దిగారు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే. పార్లమెంటులో జన్లోక్పాల్ బిల్లు ప్రవేశ పెట్టాలంటూ ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అన్నా హజారే చేపట్టిన ఈ ఉద్యమానికి దేశనలుమూలల నుంచి మద్దతు లభించింది. పెద్ద సంఖ్యలో ప్రముఖులు ప్రజలు ఆయనకు అండగా నిలిచారు. ఆ సమయంలో మై అన్నా హూ అనే క్యాంపెయినింగ్ జరిగింది. దీంతో యూపీఏ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడారు. అప్పటికే మన్మోహన్ సర్కార్ పై పలు అవినీతి ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం పుట్టుకొచ్చింది. ప్రస్తుతం నరేంద్ర మోడీ తీసుకొచ్చిన మై భీ చౌకీదార్ కూడా ఇలాంటిదే. ఇప్పుడు మై భీ చౌకీదార్ నినాదంపై కూడా కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.
47ఏళ్ల పోరాటంలో విజయం సాధించిన సుబ్రహ్మణ్య స్వామి..ఏంటా పోరాటం..?
అన్నా హజారే ఉద్యమంతో కాంగ్రెస్కు తప్పని ఓటమి
అన్నా హజారే అవినీతిపై ఉద్యమం చేపట్టిన సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా... ప్రస్తుతం ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అది కూడా చాలా బలహీన పరిస్థితుల్లో ఉంది. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం తన ప్రసంగాల్లో కాంగ్రెస్ను గాంధీ కుటుంబాలపై విమర్శలు గుప్పించకుండా ఎప్పుడూ ముగించరు. ప్రస్తుత పరిస్థితుల్లో 2019 తర్వాత ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి. కాంగ్రెస్ పై ఎంత వ్యతిరేకత ఉందో ప్రస్తుత మోడీ సర్కార్పై కూడా అదే స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. అందుకే 2019లో ఎవరు అధికారంలోకి వస్తారో అనేదానిపై కచ్చితత్వం కనిపించడం లేదు. 2014లో కూడా ఇదే పరిస్థితి ఎదురైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పటికే ప్రజలు విసిగి వేశారిపోయారు. 2014లో మోడీ మేనియా ముందు కాంగ్రెస్ నిలవలేక పోయింది.ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు కోరుకునే వారు, పట్టణాల్లో నివసించే మధ్యతరగతి కుటుంబాలు, మీడియా, తొలిసారిగా ఓటు వేసినవారు, కాంగ్రెసేతర పార్టీ రావాలనుకున్న వారంతా మోడీకి ఘనస్వాగతం పలికారు. ఇది 2014 నాటి పరిస్థితి
నాడు మోడీకి జైకొట్టిన వారే నేడు ఎందుకు భయపడుతున్నారు..?
2019కి సీన్ మొత్తం మారిపోయింది. నాడు మోడీకి ఘనస్వాగతం పలికిన కార్పొరేట్ క్లాస్ ఇప్పుడు తనపై అసంతృప్తితో ఉంది. తిరిగి బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి రావాలనే బలమైన కోరిక ఉన్నప్పటికీ ప్రధానిగా మోడీ మాత్రం వద్దంటోంది. అంతేకాదు అమిత్ షాను చూసి కూడా ఈ వర్గం ఆందోళన చెందుతోంది. మరోవైపు బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే మెజార్టీ రాదనే అంశం వీరికి ఒక్కింత ఊరట కలిగిస్తోంది. 2014లో బీజేపీ సొంతంగా 282 స్థానాల్లో విజయం సాధించినప్పటికీ.. ఓటు శాతం మాత్రం 32శాతంగానే ఉంది. అది ఎన్డీఏతో కలుపుకుంటే ఓటుశాతం 38గా ఉన్నింది. 1967లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ 283 స్థానాల్లో విజయం సాధించగా అంతేస్థాయిలో అంటే 41శాతం ఓటు షేరు లభించింది.
గత ఐదేళ్లలో మీడియాలోనే ఎక్కువగా కనిపించిన మోడీ
ఇక గత ఐదేళ్లలో చూస్తే మోడీ ఎక్కువగా మీడియాలోనే కనిపించారు. తన విదేశీ పర్యటనల్లో భాగంగా ఎన్ఆర్ఐలను ఉద్దేశించి ప్రసంగించడం, పలు దేశాధినేతలను ఆలింగనం చేసుకోవడం, అహ్మదాబాదులో పతంగులు ఎగురువేయడం, ఢిల్లీ వీధులను చీపురుతో శుభ్రం చేయడం, పరీక్షలకు ముందు విద్యార్థులకు క్లాసులు తీసుకోవడం వంటి అంశాలతో మీడియాలోనే ప్రధానంగా ఫోకస్ అయ్యారు. 1980 దశకంలో ఒక్క దూరదర్శన్ మాత్రమే ఉన్న రోజుల్లో రాజీవ్ గాంధీని ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల దూరదర్శన్ కాస్త రాజీవ్ దర్శన్ అనే అపవాదును మూటగట్టుకుంది.
కీలంకంగా మారనున్న ప్రాంతీయ పార్టీలు
ఇక 2019 ఎన్నికలు చూస్తే బీజేపీకి 150 నుంచి 300 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ 75 స్థానాల నుంచి 135 స్థానాలు గెలుపొందే అవకాశం ఉంది.ఇక మిగతా స్థానాల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగే అవకాశం ఉంది. వాస్తవ పరిస్థితి గమనిస్తే ఓటర్లలో చైతన్యం బాగా ఉంది. హిందుత్వాన్నే నమ్ముకున్న బీజేపీకి ఓటు వేసే పరిస్థితి కనిపించడం లేదు. అలాగని కాంగ్రెస్ను కూడా ఆదరిస్తారా అంటే అది కూడా కష్టంగానే కనిపిస్తోంది. మరోవైపు మోడీ-షా-దోవల్ వస్తే దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో అనే ఆందోళన సైతం కొందరి ఓటర్లలో నెలకొంది.
మొత్తానికి ఈ ఎన్నికల్లో మాత్రం రెండు జాతీయ పార్టీలకు కష్టంగానే కనిపిస్తోంది. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలే కీలకం మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.