టైమ్స్ నౌ సర్వే: మెజార్టీకి చేరువలో ఎన్డీయే, కాంగ్రెస్ ఆశలు గల్లంతు, ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అంటే?
న్యూఢిల్లీ: ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేకు 252 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి 147 సీట్లు వస్తాయని, ఇతరులకు 144 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ సర్వే ప్రీపోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. టైమ్స్ నౌ ప్రీపోల్ సర్వే ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి.
యూపీలో బీజేపీకి షాక్, 51 సీట్లు బీఎస్పీ-ఎస్పీలకు
టైమ్స్ నౌ సర్వే ప్రకారం ఉత్తర ప్రదేశ్లోని 80 లోకసభ స్థానాలకు గాను ఎన్డీయేకు 27 సీట్లు, మాయావతి - అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్బంధన్కు 51 సీట్లు, యూపీఏకు 2 సీట్లు వస్తాయని తేలింది. మహా గట్బంధన్కు 40.3 శాతం ఓట్లు, యూపీఏకు 12.5 శాతం, ఎన్డీయేకు 38.9 శాతం, ఇతరులకు 8.3 శాతం ఓట్లు వస్తాయని తేలింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీకి ఓటింగ్ శాతం భారీగా ఏమీ తగ్గటం లేదు. గతంలో కంటే కేవలం 4 శాతం ఓట్లు తగ్గుతున్నాయి. ఎస్పీ, బీఎస్పీలు కలవడం వల్ల వారికి 1.5 శాతం ఓట్లు పెరుగుతున్నాయి. వీరి కలయిక, దీంతో పెరిగిన ఓట్లే బీజేపీని దెబ్బతీస్తున్నాయి. 2014లో ఇక్కడ బీజేపీకి 73 సీట్లు వచ్చాయి. ఎస్పీ, బీఎస్పీలకు 5 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ గతంలో గెలుచుకున్న సీట్లనే గెలుచుకోగా, బీజేపీ సీట్లు మాత్రం భారీగా పడిపోనున్నాయి.
మహారాష్ట్ర, గుజరాత్ ఫలితాలు
మహారాష్ట్రలో ఉన్న 48 లోకసభ స్థానాలకు గాను యూపీఏకు 5 సీట్లు, ఎన్డీయేకు 43 సీట్లు వస్తాయని ప్రీపోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అయితే, శివసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తేనే ఈ ఫలితాలు ఉంటాయి. ఇతరులు ఒక్క సీట్లోను గెలవరని తేల్చింది. గుజరాత్లో 26 లోకసభ స్థానాలకు గాను ఎన్డీయేకు 24, యూపీఏకు 2 సీట్లు వస్తాయని తేలింది.
ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ దూకుడు
గోవాలో రెండు లోకసభ స్థానాలు ఉండగా యూపీఏ ఒక్క సీటు, ఎన్డీయే ఒక సీటు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ సర్వే ప్రీపోల్ ఫలితాలు వెల్లడించాయి. దాద్రా నగర్ హవేలీలోని ఒక్క స్థానంలో బీజేపీ గెలుస్తుందని సర్వేలో వెల్లడైంది. ఈశాన్య రాష్ట్రాల విషయానికి వస్తే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న 2 లోకసభ స్థానాలను, నాగాలాండ్లోని ఒక్క సీటును, మిజోరాంలోని ఒక్క సీటును, మేఘాలయలోని ఒక్క సీటును, త్రిపురలోని రెండు సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని ఈ సర్వే తెలిపింది. మణిపూర్లో రెండు సీట్లు ఉండగా ఒకటి యూపీఏ, ఒకటి ఎన్డీయే గెలుచుకోనుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని 11 సీట్లకు గాను ఎన్డీయే 9, యూపీఏకు 1, ఇతరులు ఒక సీటు గెలుచుకోనున్నారని తెలిపింది.
అసోం, ఒడిశా, బీహార్లలో బీజేపీ దూకుడు
అసోంలో 14 లోకసభ స్థానాలు ఉండగా యూపీఏకు 3, ఎన్డీయేకు 8, ఏజీపీకి సున్నా, ఏయూడీఎఫ్కు రెండు, ఇతరులకు ఒక సీటు వస్తుందని టైమ్స్ నౌ సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఒడిశాలోని 21 లోకసభ స్థానాలకు గాను ఎన్డీయే 13, బీజేడీ 8 స్థానాలు గెలుచుకుంటుందని తేలింది. బీహార్లో ఎన్డీయేకు 25, యూపీఏకు 15 సీట్లు వస్తాయని తేలింది.
జార్ఖండ్లో కాంగ్రెస్, బెంగాల్లో తృణమూల్
జార్ఖండ్లోని 14 లోకసభ స్థానాలకు గాను యూపీఏ 8, ఎన్డీయే 6 సీట్లు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ సర్వే ఫలితాలు వెల్లడించాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ 9 సీట్లు, యూపీఏ 1 సీట్లు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 32 సీట్లు గెలుచుకుంటుందని సర్వే తేల్చింది.
దక్షిణాదిన యూపీఏ హవా
కర్ణాటకలోని 28 సీట్లకు గాను ఎన్డీయేకు 14, యూపీఏకు 14 రానున్నాయని టైమ్స్ నౌ సర్వే ఫలితాలు వెల్లడించాయి. తమిళనాడులోని 39 లోకసభ స్థానాలకు గాను యూపీఏకు 35, ఎన్డీయేకు సున్నా, అన్నాడీఎంకేకు 4 సీట్లు రానున్నాయని తేలింది. యూపీలో డీఎంకే పార్టీ ఉంది. కేరళలోని 16 సీట్లకు గాను ఎన్డీయేకు 1, ఎల్డీఎఫ్కు 3, యూడీఎఫ్కు 16 సీట్లు రానున్నాయని తేలింది. ఏపీలో వైసీపీ, తెలంగాణలో తెరాస హవా చాటనుంది. మొత్తంగా దక్షిణాదిన ఎన్డీయేకు 17, యూపీఏకు 71, ఇతరులకు 43 సీట్లు రానున్నాయి.
ఉత్తరాఖండ్లోని సీట్లన్నీ బీజేపీవే
ఉత్తరాఖండ్లో ఐదు లోకసభ స్థానాలకు గాను 5 బీజేపీనే గెలుచుకుంటుందని టైమ్స్ నౌ సర్వేలో తేలింది. మధ్యప్రదేశ్లో 29 సీట్లకు గాను యూపీఏ 6, ఎన్డీయే 23 సీట్లు గెలుచుకుంటుందని తేలింది. రాజస్థాన్లో యూపీఏ 8, ఎన్డీయే 17 సీట్లు గెలుచుకుంటుందని తేలింది. ఛత్తీస్గఢ్లో యూపీఏకు 6, ఎన్డీయేకు 5 సీట్లు వస్తాయని తేలింది. ఢిల్లీలో 7 లోకసభ స్థానాలకు గాను ఎన్డీయే 6 ఏఏపీ 1 సీటు గెలుచుకోనుందని తేలింది.
ఇక్కడ కాంగ్రెస్ హవా
హర్యానాలో 10 లోకసభ స్థానాలకు గాను యూపీఏ 2, ఎన్డీయే 8, హిమాచల్ ప్రదేశ్లోని 4 లోకసభ స్థానాలకు గాను యూపీఏ 1, ఎన్డీయే 3 సీట్లలో గెలుస్తుందని తేలింది. జమ్ము కాశ్మీర్లోని ఆరు లోకసభ స్థానాలకు యూపీఏ 1కు, ఎన్డీయేకు 1, ఇతరులు నాలుగు సీట్లు గెలుచుకుంటారు. చండీగఢ్లోని 1 లోకసభ స్థానానికి ఆ సీటును యూపీఏ కైవసం చేసుకుంటుంది. లక్షద్వీప్లోని సీటును ఎన్సీపీ గెలుచుకోనుంది.