తక్కువగా అంచనా వేయొద్దు:2019 లోక్సభ ఎన్నికల్లో చిన్నా చితకా పార్టీలు గేమ్ ఛేంజర్స్గా మారుతాయా..?
లక్నో: ఉత్తర్ ప్రదేశ్లోని చిన్న రాజకీయపార్టీలైన నిషద్ పార్టీ, అప్నాదల్, మజ్లిస్ పార్టీలు లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపకపోయినప్పటికీ ఉత్తర్ ప్రదేశ్లో మాత్రం ఇవి బీజేపీకి కంటిలో నలుసులా మారాయి. అసెంబ్లీ ఎన్నికల విషయానికొచ్చేసరికి ఇవి ఏదో ఒక పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి నష్టం తప్పదని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే నిషద్ పార్టీ, పీస్ పార్టీ, అప్పాదల్, సుహెల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, మజ్లిస్ పార్టీలు లాంటి చిన్న పార్టీలు భారతీయ జనతాపార్టీతో తప్ప మిగత ఏ పెద్ద పార్టీలతోనైనా పొత్తులు పెట్టుకునే అవకాశముంది. దీంతో బీజేపీకి ముప్పు తప్పదనే అంచనాలు కనిపిస్తున్నాయి.
ఒకవేళ పొత్తు పెట్టుకున్నట్లయితే వారికి తక్కువ సీట్లలో పోటీ చేసే అవకాశం వస్తుంది. దీంతో మిగతా చోట్ల పొత్తుపెట్టకున్న పార్టీలకు మద్దతు తెలపడం ద్వారా బీజేపీకి చెక్ పెట్టొచ్చన్న ఆలోచనలో ఉన్నాయి. ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, నిషద్ పార్టీ, పీస్ పార్టీ, రాష్ట్రీయలోక్ దల్ పార్టీలు కలసి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్తో పొత్తుపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని గోరఖ్పూర్ ఎంపీ ప్రవీణ్ నిషద్ తెలిపారు. నిషద్ పార్టీ తరపున నుంచి తమ ఓటు బ్యాంకు ఎక్కువ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి తమ వారికి పోటీ చేసే అవకాశం కల్పించాలని లేదంటే ఫలితాలు తిరగబడతాయని ప్రవీణ్ నిషద్ తెలిపారు. మత్స్యకారులు, పడవలు నడుపుకునే వారు , నదీప్రాంతాల్లో నివసించేవారి కోసం నిషద్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ పార్టీ వ్యవస్థాపకులు సంజయ్ నిషద్ ఒకప్పుడు బీఎస్పీ నుంచి వచ్చినవారే. ఐదు నుంచి ఆరు సీట్లు కేటాయించాల్సిందిగా తాము ప్రధాన పార్టీలను కోరుతున్నట్లు సంజయ్ చెప్పారు.
చిన్న పార్టీలు అన్నీ ఒక్క బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడం లేదు. కొన్ని బీజేపీతో కూడా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అలాంటి పార్టీల్లో అప్పాదల్ ఒకటి. ఆ పార్టీ వ్యవస్థాపకులు అనుప్రియ పటేల్ ప్రస్తుతం ఎన్డీఏ సర్కార్లో కేంద్ర మంత్రిగా ఉన్నారు. 2019లో బీజేపీతోనే కలిసి పోటీచేస్తామని ఆ పార్టీ స్పష్టం చేసింది. మొత్తం ఓటు బ్యాంకులో 12శాతం ఓటు బ్యాంకు ఒక్క కుర్మి సామాజిక వర్గానిదేనని కచ్చితంగా అప్నాదల్ పార్టీ గేమ్ ఛేంజర్గా ఆవిర్బవిస్తుందని అన్నారు ఆ పార్టీ ప్రతినిధి అరవింద్ శర్మ.
ఇక ఉత్తర్ ప్రదేశ్లో బీజేపీకి ప్రమాదకరంగా మారిన పార్టీ మజ్లిస్ పార్టీ. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా ఆపార్టీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఆ పార్టీకే మద్దతు పలికే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు విపక్షాల నుంచి సరైన స్పందన రాకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు అసదుద్దీన్. విపక్షాలు కూటమిగా ఏర్పడుతున్న నేపథ్యంలో వారితో భాగస్వామ్యం కావాలని తమకుందని అయితే వారు మజ్లిస్ పార్టీని విస్మరిస్తే తాము కూడా ఆ కూటమిని పూర్తిగా విస్మరించాల్సి ఉంటుందని మజ్లిస్ పార్టీ ప్రతినిధి అసిమ్ వకార్ అన్నారు. చిన్న పార్టీలతో పొత్తు లేకుండా బీజేపీని ఢీకొనడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే... చిన్న పార్టీలన్నీ ఏకమౌతే బీజేపీకి ఉత్తర్ ప్రదేశ్లో గడ్డుకాలమే వస్తుందని జేఎన్యూ ప్రొఫెసర్ పొలిటికల్ కామెంటేటర్ సంజయ్ కే పాండే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేల పోటీ నువ్వా నేనా అన్న రీతిలో సాగితే చిన్న పార్టీలకు పెద్ద ఎత్తున ప్రాముఖ్యత ఏర్పడుతుందని మరో ప్రొఫెసర్ మనింద్రనాథ్ ఠాకూర్ చెప్పారు.