ఈ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం, ప్రభావం ఎన్నడూ లేనంతగా ఉంటుంది: మాజీ సీఈసీ కృష్ణమూర్తి
ఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇంతకుమునుపెన్నడూ లేనంతగా డబ్బు ప్రభావం, హింస, ద్వేషవిద్వేషాలు ఎక్కువగా ఉంటాయని జోస్యం చెప్పారు కేంద్ర ఎన్నికల మాజీ ప్రధానాధికారి టీఎస్ కృష్ణమూర్తి. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీల మధ్య వార్ పీక్ స్టేజెస్కు చేరుకున్న నేపథ్యంలో కృష్ణమూర్తి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో కృష్ణమూర్తి కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల నిర్వహణ తేదీ ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించకపోవడాన్ని తప్పుబట్టిన కొందరు రాజకీయనాయకుల వాదనను కృష్ణమూర్తి కొట్టిపారేశారు.
ఈ ఎన్నికల్లో విపరీతమైన డబ్బు ప్రవాహం, హింస చెలరేగిపోతాయని అన్నారు కృష్ణమూర్తి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాజకీయనాయకుల మధ్య మాటలయుద్ధం చూస్తుంటే కచ్చితంగా హింస చెలరేగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ వాతావరణంలో ఎన్నికలు సజావుగా నిర్వహించాలంటే ఎన్నికల సంఘానికి సవాలుతో కూడిన పని అని అన్నారు కృష్ణమూర్తి. అదే సమయంలో ఎన్నికల కోడ్ను అమలు చేయడం కూడా కష్టతరమే అవుతుందని వెల్లడించారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం దీన్ని సవాలుగా స్వీకరించి విజయం సాధిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
రాజస్థాన్లో కూలిన మిగ్-21 యుద్ధ విమానం.... ఏమి జరిగి ఉంటుంది..?
ఎన్నికల తేదీని ఈసీ ఇంకా ప్రకటించకపోవడాన్ని కొందరు నాయకుల వాదనను ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఓ తేదీ ఉంటుందని ఆ తేదీలోగా ఎన్నికలు జరిగి గెలిచిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. కాబట్టి దీనిపై పెద్దగా ఆలోచించాల్సిందేమీ లేదని అదంతా ఎన్నికల సంఘం చూసుకుంటుందని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులను సమీక్షించిన తర్వాతే ఎన్నికల సంఘం ఓ నిర్ణయానికి వస్తుందని చెప్పారు. ఎన్నికల సంఘం తనపని తాను చేసుకునేందుకు సహకరించాలి తప్ప ఈసీని తప్పుబట్టడం వల్ల ప్రయోజనం లేదని చెప్పారు. గత సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తన అధికారిక పర్యటనలు జరిపిన తర్వాత ఎన్నికల నిర్వహణ తేదీని ప్రకటించేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోందని అన్నారు. అహ్మద్ పటేల్ వ్యాఖ్యలపైనే కృష్ణమూర్తి వివరణ ఇచ్చారు.