బెంగాల్పై బీజేపీ కన్ను ? .. ప్రభుత్వ అస్థిరతకు బీజేపీ యత్నం ? ఢొకాలేదని దీదీ ధీమా
కోల్ కతా : బీజేపీ విజయ దుందుబిపై విపక్ష పార్టీల్లో కలవరపడుతున్నాయి. ఇప్పటివరకు ప్రధాని మోదీ, అమిత్ షాను ఢీ అన్న టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ కూడా ఆందోళనకు గురవుతున్నారు. బెంగాల్లో మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే అప్పటివరకు తన ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోవాలనే అంశం మమతను వేధిస్తోంది.
పక్కలో బళ్లెం ..
బెంగాల్లో టీఎంసీతో సమానంగా బీజేపీ సీట్లను గెలుచుకోవడం మమతను కునుకుతీయడం లేదు. దీనికితోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమతో 40 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యలు మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. నిజంగా పార్టీ ఎమ్మెల్యేలు మోదీతో మాట్లాడారా ? ఎవరెవరు టచ్లో ఉన్నారని మదనపడుతున్నారు. దీనికి ఊతమిస్తూ బీజేపీ బెంగాల్ ఉపాధ్యక్షుడు జయప్రకాశ్ మజుందార్ స్పందించారు. టీఎంసీ నేతలు, ఎమ్మెల్యేలు పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్నారనే ఆయన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వారు ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారని .. వారంతా తమ పార్టీలో చేరతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
కమ్యునిస్టులు కారే ..
టీఎంసీలో ఉన్న నేతలు కమ్యునిస్టులు కారని .. వారి లాగా భావజాలం, ఆలోచనాధోరణి ఉండటానికి ఉదహరించారు. దీనికితోడు బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా బెంగాల్లో టీఎంసీ సర్కార్పై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. బెంగాల్లో టీఎంసీ 22 సీట్లకే పరిమితం అవడం ఆ పార్టీ బలంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. బీజేపీ సింగిల్ డిజిట్ కూడా రాదని అనుమానం వ్యక్తం చేస్తే .. డబుల్ డిజిట్ రావడం ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం నింపింది.
దీదీ ధీమా
అయితే అసెంబ్లీలో తమ బలంపై టీఎంసీ విశ్వాసం వ్యక్తం చేసినట్టు పేరు చెప్పేందుకు ఇష్టపడని నేత ఒకరు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 294 స్థానాలు ఉండగా .. తమకు 213 ఎమ్మెల్యేల బలం ఉందని చెప్తున్నారు. తమ ప్రభుత్వాన్ని పడేయాలంటే ఆ పార్టీకి రెండింతల మూడోవంతు సభ్యుల మద్దతు కాదని .. వారిని సమీకరించడం అంతా ఈజీ కాదని పేర్కొన్నారు. బెంగాల్లో టీఎంసీ సీట్లు తగ్గడం .. ఆ పార్టీపై ప్రభావం చూపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. టీఎంసీతో సమానంగా బీజేపీ సీట్లు గెలవడంతో .. ప్రభుత్వంలో అలజడి నెలకొంటుందని పేర్కొంటున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటకలో ప్రకంపనలు మొదలైతే ... చివరికి బెంగాల్కు కూడా రావడం ఖాయమని అంచనా వేస్తున్నారు.
బెంగాల్పై కన్ను ?
కేంద్రప్రభుత్వం బెంగాల్పై ఫోకస్ చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను బూచీగా చూపి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరత పరిచేందుకు ప్రయత్నిస్తుందని పేర్కొంటున్నారు. వివిధ కారణాలు చూపి బెంగాల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తుందని చెప్తున్నారు. దీనికితోడు ముస్లింలు టీఎంసీకి మరింత దూరమవుతున్నారని .. దీనికి కారణమని జాతీయ పౌరసత్వ గుర్తింపేనని టీఎంసీ ఎంపీ పుబేర్ కలోమ్ పేర్కొన్నారు. ఇప్పటికే అసోంలో ఈ ప్రక్రియ పూర్తైనందున .. తదుపరి బెంగాల్లో జరగుతుందని అంచనా వేశారు. అయితే మమతా ముందుజాగ్రత్తలతో ప్రభుత్వాన్ని కాపాడుకునే అవకాశాలు కూడా ఉన్నాయని వాదిస్తున్నారు మరికొందరు.