రాత్రంతా యూపీ నేతలతో ప్రియాంక గాంధీ భేటీ, బుధవారం ఉదయం గం.5.00 దాకా..
లక్నో: ఉత్తర ప్రదేశ్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకా గాంధీ మంగళవారం రాత్రంతా రాష్ట్ర నేతలతో సమాలోచనలు జరిపారు. మంగళవారం నుంచి మొదలు బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఆమె పలువురు నేతలతో మాట్లాడారు.
మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం వేకువజాము వరకు భేటీ
ప్రియాంక గాంధీ పార్టీ కార్యాలయంలోనే గడిపారు. దాదాపు పదహారు గంటల పాటు ఆమె పలువురు నేతలను కలిసి, ఎన్నికలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జిల్లాల అధ్యక్షులు, ఎనిమిది లోక్సభ నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలతో ఆమె విడివిడిగా మాట్లాడారు. అమేథి, రాయ్బరేలీ నుంచి వచ్చిన వారినీ కలిశారని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం సమావేశం ప్రారంభం కాగా బుధవారం వేకువజాము వరకు కొనసాగింది.
పది నియోజకవర్గాల నేతలతో
ప్రియాంక గాంధీ పది నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలను కలిశారు. ప్రతి నియోజకవర్గం నేతలతో గంట నుంచి రెండు గంటల మధ్య భేటీ అయ్యారు. యూపీలో కాంగ్రెస్ మంచి స్థానాలు గెలుచుకోనుందని ఈ సందర్భంగా కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. ఆమె మంగళవారం ఆఫీస్కు చేరుకోగానే పలువురు ముఖ్య నేతలతో మాట్లాడారు. అనంతరం లక్నో, ఉన్నవ్, మోహన్లాల్ గంజ్, రాయ్ బరేలీ, ప్రతాప్గర్, ప్రయాగ్రాజ్, అంబెడ్కర్ నగర్, సీతాపూర్, కౌశంబి, ఫతేపూర్, బహ్రెచ్, ఫుల్పూర్, అయోధ్య లోకసభ నియోజకవర్గం నేతలతో భేటీ అయ్యారు.
కొత్త ఉత్సాహం
ప్రతి నియోజకవర్గం నుంచి 10 నుంచి 20 మంది ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు. లక్నో నుంచి వచ్చిన 70 మందితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నేతల్లో ఆమె కొత్త ఉత్సాహాన్ని తీసుకు వచ్చారు.