అంతుబట్టని వైరస్, ఇన్ఫెక్షన్: గిర్ అడవుల్లో 18రోజుల్లో 21 సింహాల మృతి
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అభయారణ్యంలో గుర్తు తెలియని వైరస్, ఇన్ఫెక్షన్ల కారణంగా మృతి చెందుతున్న సింహాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏం చేయాలో తెలియక అధికారులు ఆందోళన చెందుతున్నారు.
గడచిన 18 రోజుల వ్యవధిలో 21 సింహాలు మరణించినట్టు గుర్తించిన అధికారులు తెలిపారు. వీటిలో నాలుగు సింహాలు వైరస్తో, ఆరు సింహాలు ప్రొటోజోవా ఇన్ఫెక్షన్ తో మరణించాయని భావిస్తున్నట్టు తెలిపారు. పురుగుల ద్వారా ఈ ఇన్ ఫెక్షన్ వ్యాపిస్తోందని నిర్ధారించారు.
దల్ఖానియా రేంజ్ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ ప్రభావం అధికంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలోని పలు సింహాలు అనారోగ్యంతో ఉన్నాయని గుర్తించామని, వాటిని రెస్క్యూ కేంద్రానికి తరలించి చికిత్సను అందిస్తున్నామని తెలిపారు.
మరణించిన సింహాల కళేబరాల్లో తమకు కనిపించిన వైరస్ ఏంటన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని వైద్యులు తెలిపారు. మిగతా సింహాలకు వైరస్ సోకకుండా యూఎస్ నుంచి వాక్సిన్ ను తెప్పిస్తున్నామని గుజరాత్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, గిర్ అడవుల్లో 2015 గణన ప్రకారం 520 సింహాలున్నాయి. మనదేశంలో గిర్ అడవులు సింహాలకు అతి పెద్ద ఆవాసంగా గుర్తింపు పొందింది.