షాకింగ్ డేటా.. లాక్ డౌన్లో మహిళలపై గృహ హింస ఎంతలా పెరిగిందంటే..
లాక్ డౌన్ పీరియడ్లో మహిళలపై గృహ హింస పెరిగింది. దీంతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పంజాబ్ తమ రాష్ట్రంలో నమోదైన ఫిర్యాదు వివరాలను వెల్లడించింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో మహిళలపై నేరాలకు సంబంధించి 5695 ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపింది. అంటే,గతంతో పోలిస్తే 21శాతం ఫిర్యాదులు పెరిగినట్టు పేర్కొంది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 20 వరకు 4709 కేసులు నమోదైనట్టు తెలిపింది.
మార్చి 23 నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న తెలిసిందే. లాక్ డౌన్ పీరియడ్లో పంజాబ్లో 21శాతం గృహ హింస ఫిర్యాదులు పెరిగాయి. ఫిబ్రవరి-మార్చి నెలలో 3287 గృహ హింస ఫిర్యాదులు రాగా.. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ 3993 ఫిర్యాదులు వచ్చాయి. అదే సమయంలో వరకట్న వేధింపులు,ఈవ్ టీజింగ్ వంటి కేసులు కొంతమేర తగ్గాయి. రాష్ట్ర డీజీపీ దినకర్ గుప్తా ఈ వివరాలను వెల్లడించారు.
ప్రభుత్వ డేటా ప్రకారం.. మార్చి 21 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో 112 నంబర్కు ప్రతీ రోజూ 133 ఫోన్ కాల్స్ పెరిగాయి. ఇందులో 34 ఫోన్ కాల్స్ గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదులే కావడం గమనార్హం. ఫిర్యాదులు వస్తున్న ప్రాంతాల్లో సోషల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్,మహిళా శిశు సంక్షేమ శాఖ నామినేట్ చేసిన కౌన్సెలర్లతో సమన్వయం చేసుకుని సమస్యలను పరిష్కరిస్తున్నట్టు తెలియజేశారు. 112 నంబర్కు వచ్చే ప్రతీ కాల్ను జిల్లా కంట్రోల్ రూమ్కు ఫార్వర్డ్ చేస్తున్నట్టు తెలిపారు. అక్కడున్న వుమెన్ రెస్పాన్స్ టీమ్ వాటిపై స్పందిస్తుందన్నారు. ఒకవేళ శారీరక హింస జరిగితే.. కేసులు నమోదు చేసి బాధితులను ఆసుపత్రికి తరలిస్తున్నట్టు చెప్పారు.