సహజీవనం: 30ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు
రాంచీ: పేదరికం వారికి పెళ్లికి అడ్డొచ్చింది. దీంతో మూడు ముళ్లు.. ఏడు అడుగుడులు వేయలేయకుండానే వారు తమ వైవాహిక జీవితాన్ని కొనసాగించారు. ఇలా 21 జంటలు.. 30ఏళ్లపాటు కాపురం చేశాయి. అయితే ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఇప్పుడు వారంతా ఒక్కటయ్యారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ ఖుంతీ జిల్లాలోని ముండా తెగ కడు పేదరికంలో ఉంది. వివాహం చేసుకునే ఆర్థిక స్తోమత కూడా వారికి లేదు. దీంతో పెళ్లి తంతు లేకుండానే 30 ఏళ్లు తమ సంసార ప్రయాణాన్ని సాగించాయి. నిమిట్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ 21 జంటలకు ఆదివారం ఘనంగా వివాహం జరిపించింది.
ఈ సందర్భంగా నిమిట్ డైరెక్టర్ నిఖితా సిన్హా మాట్లాడుతూ.. వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టులో(పారిశుద్ధ్యంపై) భాగంగా ముండా తెగ నివసిస్తున్న గ్రామానికి వెళ్లినప్పుడు 21జంటలు పెళ్లిళ్లు లేకుండానే సంసార జీవితాన్ని గడుపుతున్నాయని తెలిసిందని చెప్పారు.
ఆ జంటలకు ఘనంగా పెళ్లి చేయాలని అనాడే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే 21 జంటలకు వివాహం జరిపించామని నిఖితా సిన్హా పేర్కొన్నారు. అంతేగాక, ప్రపంచ బ్యాంకు సహకారంతో ఇక్కడి గ్రామాల్లో పరిశుభ్రతకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.