షిర్డీలో యువతిపై గ్యాంగ్ రేప్, దారుణ హత్య
షిర్డీ: పవిత్ర పుణ్యక్షేత్రం షిర్డీకి యువతిని తీసుకు వెళ్లి సామూహిక అత్యాచారం, హత్య చేసిన సంఘటన వెలుగు చూసింది. యువతిని హత్య చేసి పరారైన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మంగళవారం ఒక నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మహారాష్ట్రలోని షాహాపూర్ జిల్లా హడవేలి గ్రామంలో 21 సంవత్సరాల యువతి నివాసం ఉంటున్నది. మే 1వ తేదిన గోరక్ దసడే (19), రాహుల్ దసడే (21) అనే ఇద్దరు యువకులు 21 సంవత్సరాల యువతిని పిలుచుకుని షిర్డీ వెళ్లారు, వీరి వెంట గుర్తు తెలియని మహిళ ఉంది.
యువతిని షిర్డీ తీసుకు వెళ్లి ఒక లాడ్జ్ లో మూడు రోజుల పాటు ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. తరువాత యువతిని హత్య చేసి మృతదేహాన్ని తీసుకు వెళ్లి సాప్ గాన్ గ్రామం శివార్లలోని నదిలో విసిరివేశారు. నీటిలో మృతదేహాం తేలుతున్న విషయం గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
ఇన్స్ పెక్టర్ ఎం.బి. సకలే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామస్తులు, షిర్డీలోని లాడ్జ్ సిబ్బంది తెలిపిన వివరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేశారు. మంగళవారం ఉదయం షాహాపూర్ లో తలదాచుకున్న గోరక్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. మరో నిందితుడు రాహుల్, మహిళ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.