21 ఏళ్ల వయస్సులోనే..న్యాయమూర్తి పదవికి: దేశంలోనే యంగెస్ట్ జడ్జిగా
జైపూర్: ఆ కుర్రాడి వయస్సు 21 సంవత్సరాలే. ఆ వయస్సులోనే ఉన్న యువకులు ఉద్యోగ వేటలోనో లేక.. ఉన్నత చదువుల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతూనో కనిపిస్తుంటారు. ఆయన మాత్రం.. ఓ సరికొత్త రికార్డును సృష్టించారు. దేశంలోనే యంగెస్ట్ జడ్జిగా నియమితులయ్యారు. 21 సంవత్సరాల వయస్సులోనే న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఆయన పేరు మయాంక్ ప్రతాప్ సింగ్. రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని మానస సరోవర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.
మయాంక్.. రాజస్థాన్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి. ఈ ఏడాది ఏప్రిల్ లోనే తన అయిదేళ్ల ఎల్ఎల్బీని పూర్తి చేశారు. ఆ వెంటనే రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహించిన జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలను రాశారు. ఆ పరీక్షలు ఆయన జీవితాన్ని మలుపు తిప్పాయి. జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షల్లో ర్యాంక్ ను సాధించారు. తొలి ప్రయత్నంలోనే మయాంక్.. ఈ రాజస్థాన్ జ్యుడీషియల్ పరీక్షల్లో ఘన విజయాన్ని సాధించడం మరో రికార్డుగా చెప్పుకోవచ్చు.
రాజస్థాన్ హైకోర్టు ఈ పరీక్షలను నిర్వహించింది. ఇదివరకు జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలను రాయడానికి కనీస వయస్సు 23 సంవత్సరాలుగా ఉండేది. న్యాయ విద్యార్థుల నుంచి వస్తోన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని రాజస్థాన్ హైకోర్టు ఈ వయస్సు నిబంధనను సడలించింది. 21కి తగ్గించింది. ఈ అవకాశాన్ని వదులుకోలేదు మయాంక్. పట్టుబట్టారు. రోజూ 12 గంటల పాటు చదువుకున్నారు. జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షల్లో ర్యాంక్ సాధించారు.