నడి రోడ్డులో కాలేజ్ విద్యార్థిని కాల్చి చంపాడు, అక్కడే రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య!
లక్నో: ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఇంటికెళ్లి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గడం లేదు. ప్రతి రోజూ ఎక్కడో అక్కడ జరగరాని దారుణాలు జరుగుతున్నాయి. తాజా మరో కాలేజ్ విద్యార్థిని నడిరోడ్డులో కాల్చి చంపేశారు.
ఉత్తరప్రదేశ్ లోని ఇటా జిల్లాలో 18 ఏళ్ల యువతి కాలేజ్ కు వెళ్లింది. తరువాత కాలేజ్ ముగించుకుని స్నేహితులతో కలిసి నడుచుకుంటూ ఇంటికి బయలుదేరింది. మార్గం మధ్యలో 21 ఏళ్ల యువకుడు నడి రోడ్డులో కాలేజ్ విద్యార్థిని అడ్డుకున్నాడు.
తరువాత ఆమెతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆమెను అక్కడి నుంచి లాక్కెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే కాలేజ్ విద్యార్థి అతనితో వెళ్లడానికి నిరాకరించింది. అంతే సహనం కోల్పోయిన యువకుడు జోబులో ఉన్న రివాల్వర్ బయటకు తీశాడు.
అందరూ చూస్తుండగానే కాలేజ్ విద్యార్థినిపై కాల్పులు జరిపాడు. వెంటనే ఆ యువకుడు తనను తానే కాల్చుకున్నాడు. తీవ్రగాయాలైన యువకుడు అక్కడికక్కడే మరణించాడు. కాలేజ్ విద్యార్థిని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మరణించింది.
ఈ విషయంపై ఇటా జిల్లా ఎస్పీ అఖిలేష్ కుమార్ చురాసియా మీడియాతో మాట్లాడారు. యువతిని ఎందుకు హత్య చేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయం కచ్చితంగా తెలియడం లేదని, కేసు విచారణలో ఉందని జిల్లా ఎస్పీ అఖిలేష్ కుమార్ చురాసియా చెప్పారు.