రక్షించబోతే కరోనా సోకింది - కేరళ విమాన ప్రమాద సహాయకచర్యల్లో పాల్గొన్న 22 మంది అధికారులకు..
గతవారం కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్టులో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 737 విమాన ప్రమాదంలో 18 మంది చనిపోగా... మరో 150 మంది గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో పైలట్ వసంత్ సాథేతో పాటు అధికారులు సకాలంలో స్పందించి ఉండకపోతే ఈ 150 మందిలో మరికొంత మంది ప్రాణాలు కోల్పోయే వారని విచారణ కమిటీ ఇప్పటికే తేల్చింది. ప్రమాదం జరిగిన వెంటనే తక్షణం స్పందించి బాధితులకు అవసరమైన సాయం అందించడంలో తిరువనంతపురం కలెక్టర్తో పాటు పలువురు అధికారుల స్పందన పలువురి ప్రశంసలు అందుకుంది.
అయితే దుబాయ్లో చిక్కుకున్న ప్రవాస భారతీయులను తీసుకొచ్చిన ఈ విమానంలో అప్పటికే పలువురికి కరోనా సోకడంతో వీరిని ప్రమాదం నుంచి రక్షించే క్రమంలో 22 మంది అధికారులు కరోనా పాలయ్యారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తిరువనంతపురం జిల్లా కలెక్టర్తో పాటు మరో 21 మందికి కరోనా సోకినట్లు మలప్పురం వైద్యాధికారి ప్రకటించారు.
అయితే ప్రాణాలకు తెగించి విమాన ప్రయాణికులను రక్షించిన వీరికి కరోనా సోకడంపై సానుభూతి వ్యక్తమవుతోంది. వీరంతా సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టకపోతే విమాన ప్రమాదం తీవ్రత చాలా ఎక్కువగా ఉండేదన్న వాదన కూడా వినిపిస్తోంది.
కరోనా తర్వాత దుబాయ్ నుంచి వచ్చిన విమాన ప్రయాణికులను రక్షించిన నేపథ్యంలో తాజాగా వీరికి ప్రభుత్వం కరోనా పరీక్షలు చేయించింది. వీరిలో కొందరిని తిరువనంతపురం ప్రధాన ఆస్పత్రిలోనూ మరికొందరికి ఇతర ఆస్పత్రుల్లోనూ చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా త్వరగా కోలుకునేందుకు అవసరమమైన చర్యలు తీసుకోవాలని విజయన్ సర్కార్ ఆదేశించింది.