జరభద్రం: జైపూర్లో 22 జికా వైరస్ కేసులు..ప్రభుత్వాన్ని అలర్ట్ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: ఓ వైపు రాజస్థాన్లో ఎన్నికల హీట్ పెరుగుతోంటే మరోవైపు ఆరాష్ట్రాన్ని ప్రమాదకర జికా వైరస్ గడగడలాడిస్తోంది. ఇప్పటికే జైపూర్లో 22 మందికి జికా వైరస్ సోకినట్లు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. బీహార్ రాష్ట్రం సివాన్కు చెందిన ఒక వ్యక్తి జైపూర్లో ఉన్న సమయంలో జికా వైరస్ సోకింది. జైపూర్లో చదువుకుంటున్న ఆ వ్యక్తి ఓ పరీక్ష రాసేందుకు తన సొంతూరు సివాన్కు వచ్చాడు. దీంతో తన కుటుంబ సభ్యులకు కూడా జికా వైరస్ సోకి ఉంటుందనే అనుమానంతో వారిని కూడా పరీక్షిస్తున్నారు వైద్యులు.
జైపూర్లో జికా వైరస్ కలకలం
జైపూర్లో 22 మందికి జికా వైరస్ టెస్టులో పాజిటివ్గా రావడంతో ప్రధాని కార్యాలయం దృష్టిసారించింది. పరిస్థితి తీవ్రరూపం దాల్చకముందే నివారణ చర్యలు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించింది. అంతేకాదు ఆరోగ్యశాఖ నుంచి నివేదికను కోరింది పీఎంఓ. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన హైలెవెల్ కమిటీ జైపూర్కు చేరుకుంది. అక్కడే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి అనునిత్యం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ కూడా పరిస్థితిపై ఆరాతీస్తోంది. ఇప్పటి వరకు 22 కేసులు నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.
జికా వైరస్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించండి
జైపూర్ పరిధిలోని నివసిస్తున్న ప్రజల్లో జికా వైరస్కు సంబంధించిన లక్షణాలు కనపడితే వెంటనే శాంపుల్స్ సేకరించి పరీక్ష కోసం ల్యాబ్కు తరలిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అంతేకాదు దోమలను కూడా పరీక్షిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. పరీక్షలు నిర్వహించేందుకు అదనపు పరికరాలను కూడా లాబొరేటరీలకు అందిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి జికా వైరస్కు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని రకాల మెటీరియల్ కూడా పంపినట్లు కేంద్రం వెల్లడించింది.
ఇక జైపూర్లో నివాసముంటున్న గర్భిణి స్త్రీల పరిస్థితి కూడా సమీక్షిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. వారికి ముందస్తుగా మందులు కూడా సరఫరా చేసినట్లు అధికారులు వెల్లడించారు. కడుపులో బిడ్డపట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలో కూడా వివరిస్తున్నట్లు వారు తెలిపారు.
ప్రపంచానికి పెనుభూతంలా పరిణమించిన జికా వైరస్
ప్రస్తుతం ప్రపంచాన్నే కుదిపేస్తోంది ఈ జికా వైరస్. ప్రపంచవ్యాప్తంగా 86 దేశాల్లో జికా వైరస్ ఉన్నట్లు సమాచారం. ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లానే డెంగూ, జ్వరం, చర్మంపై పొడులు, మద్రాస్ ఐ, కండరాలు మరియు కీళ్ల నొప్పులు, విపరీతమైన తలనొప్పిలాంటి లక్షణాలు ఉంటే జికా వైరస్ టెస్టు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక భారత్లో తొలి జికా వైరస్ కేసు 2017 జనవరి ఫిబ్రవరి మధ్య బయటపడింది. రెండో కేసు తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో అదే ఏడాది జూలైలో వెలుగు చూసింది. రెండు కేసుల్లో జికా వైరస్ స్పష్టంగా ఉన్నట్లు తేలిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.