మాజీ ప్రియుడి టార్చర్: నవ వివాహిత ఆత్మహత్య, నెల క్రితం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో, ఏం జరిగింది !
బెంగళూరు: మాజీ ప్రియుడి వేదింపుల కారణంగా నవ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని మడికేరి పట్టణంలో జరిగింది. మడికేరిలోని డైరి ఫాం సమీపంలో నివాసం ఉంటున్న దివ్యా జ్యోతి (22) అనే నవ వివాహిత ఆత్మహత్య చేసుకుందని మంగళవారం పోలీసులు తెలిపారు.
పీజీ విద్యాభ్యాసం చేసిన దివ్యా జ్యోతి మడికేరి పట్టణంలోని ఓ షోరూంలో ఉద్యోగం చేస్తున్నది. గతంలో పవన్ అనే వ్యక్తిని దివ్యా జ్యోతి ప్రేమించింది. పవన్, దివ్యా జ్యోతి వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. అయితే కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో దివ్యా జ్యోతి పవన్ ను దూరం పెట్టింది.
పవన్ కు దూరం అయిన తరువాత దివ్యా జ్యోతి మడికేరికి చెందిన బ్రిజేష్ అనే వ్యక్తిని ప్రేమించింది. కుటుంబ సభ్యులకు తెలీకుండా ఆరు నెలల క్రితం రహస్యంగా మడికేరిలోని దేవాలయంలో దివ్యా జ్యోతి, బ్రిజేష్ లు వివాహం చేసుకున్నారు. పెళ్లి జరిగిన విషయం ఇంటిలో తెలీకుండా దివ్యా జ్యోతి జాగ్రత్తలు తీసుకుంది.
నెల క్రితం మడికేరిలోని రిజిస్టర్ కార్యాలయంలో దివ్యా జ్యోతి, బ్రిజేష్ ల పెళ్లి రిజిస్ట్రేషన్ (నమోదు) చేయించుకున్నారని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న పవన్ మాజీ ప్రియురాలు దివ్యా జ్యోతిని వేదింపులకు గురి చేశాడని సమాచారం. ఈ విషయంపై దివ్యా జ్యోతి జీవితంపై విరక్తి పెంచుకుంది.
సోమవారం షోరూం నుంచి ఇంటికి వెళ్లిన దివ్యా జ్యోతి ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. భార్య దివ్యా జ్యోతికి బ్రిజేష్ ఫోన్ చేశాడు. ఆమె ఎంత సేపటికి మొబైల్ రిసీవ్ చెయ్యకపోవడంతో ఇంటికి వెళ్లి చూడగా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు చెప్పారు.
దివ్యా జ్యోతి ఆత్మహత్మ చేసుకునే ముందు డెత్ నోట్ రాసిపెట్టంది. తన మాజీ ప్రియుడు పవన్ వేదింపులకు గురి చెయ్యడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని దివ్యా జ్యోతి డెత్ నోట్ రాసి పెట్టిందని పోలీసులు అన్నారు. దివ్యా జ్యోతి ఆత్మహత్యపై అనేక అనుమానాలు ఉన్నాయని, ఆమె భర్త బ్రిజేష్, మాజీ ప్రియుడు పవన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.