వర్ధమాన గాయని దారుణ హత్య! ఆ కేసులో.. ప్రధానసాక్షిఈమే, అందుకే లేపేశారా?
హర్యానాలో వర్ధమాన హర్షిత దహియాను (22) దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని ఇద్దరు యువకులు ఆమెపై అతి సమీపంనుంచి కాల్పులు జరిపి హత్య చేశారు. పానిపట్ జిల్లాలోని ఛమ్రా గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ దారు
Recommended Video
చండీఘడ్: హర్యానాలో వర్ధమాన గాయని హర్షిత దహియా (22) దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని ఇద్దరు యువకులు ఆమెపై అతి సమీపంనుంచి కాల్పులు జరిపి హత్య చేశారు.
పానిపట్ జిల్లాలోని ఛమ్రా గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం... పానిపట్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న గాయని హర్షిత సాయంత్రం 4 గంటల సమయంలో తిరిగి కారులో ఢిల్లీకి బయలుదేరారు. ఛమ్రా గ్రామ సమీపంలోకి రాగానే మరో కారు ఈమె కారును ఓవర్ టేక్ చేసి ముందుకెళ్ల్ళి ఆగింది.
అందులోంచి దిగిన ఇద్దరు యువకులు గాయని ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ ను, ఆమెకు తోడుగా ఉన్న ఇద్దరు అసిస్టెంట్లను దిగమని చెప్పి బెదిరించారు. వారు భయపడి కార్లోంచి దిగగానే ఆ ఇద్దరు దుండగులు కారులో ఉన్న గాయని హర్షితపై కాల్పులు జరిపి పారిపోయారు.
గొంతులోంచి, నుదిటిలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో గాయని హర్షిత అక్కడికక్కడే ప్రాణాలు విడిచారని పానిపట్ ఎస్పీ రాహుల్ శర్మ వెల్లడించారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించినట్టు చెప్పారు.
గాయని హర్షిత దహియా ఢిల్లీలోని నరేలాలో నివసిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఆమె తల్లిని అత్యాచారం చేసి, హత్య చేశారు. ఆ కేసులో హర్షిత ప్రధాన సాక్షిగా ఉన్నారు. ఈ కేసులో హర్షిత బావ ఇప్పటికే జైలులో ఉన్నాడు.
తనను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని, అయినా తాను భయపడనంటూ గతంలో హర్షిత సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. అయితే ఈ విషయంలో ఆమె తనకు భద్రత కల్పించాల్సిందిగా పోలీసులను అడిగారా? లేదా? అన్నది తెలియరాలేదు.
ఈ కేసును నీరుగార్చడం కోసమే ప్రధాన సాక్షి అయిన హర్షితపై దుండగులు కాల్పులు జరిపి చంపేసి ఉంటారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ హత్య కేసులో మరింత దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.