పెద్దలను ఒప్పించి.. ఆ యువతి శ్రీకృష్ణుడినే పెళ్లాడింది!
మధ్యప్రదేశ్ లోని టికంగడ్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. కృష్ణుడి భక్తురాలైన ఓ వికలాంగ యువతి ఏకంగా ఆయన విగ్రహాన్నే వివాహం చేసుకుంది.
భోపాల్: మధ్యప్రదేశ్ లోని టికంగడ్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. కృష్ణుడి భక్తురాలైన ఓ వికలాంగ యువతి ఏకంగా ఆయన విగ్రహాన్నే వివాహం చేసుకుంది. మొదట కుటుంబసభ్యులు వ్యతిరేకించినా.. ఆ తర్వాత అంగీకరించడంతో ఈ వివాహం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. టికంగఢ్ జిల్లాకి చెందిన శాలిని అనే 22 ఏళ్ల యువతి అంధురాలు. చిన్నప్పటి నుంచి ఆమెకు రామాయణం, భగవద్గీతల కథలు వినడం అలవాటు. వికలాంగురాలైన శాలిని చిన్నప్పటి నుంచి కృష్ణుడిని కొలుస్తుండడంతో శాలినిలో ఏదో తెలీని శక్తి ఉందని నమ్మిన గ్రామస్థులు ఆమెను ఎంతగానో గౌరవించేవారు.
ఉన్నట్టుండి శాలిని తానెంతగానో కొలిచే కన్నయ్యని వివాహం చేసుకుంటానని తండ్రి మున్నాలాల్కి చెప్పింది. కూతురి ఇష్టాన్ని కాదనలేక వెంటనే మున్నాలాల్ ఓ పూజారిని పిలిపించి డిసెంబర్ 4న ముహూర్తం పెట్టారు. ఊరు ఊరంతా తరలివచ్చి సాధారణ వివాహాలలాగే పెళ్లికి ముందు మెహెందీ, సంగీత్ కార్యక్రమాలు కూడా జరిపించారు.
అంతేగాక, వరుడి తరఫున వధువు ఇంటికి బంధుమిత్రులు ఊరేగింపుగా వెళ్లారు. డిసెంబర్ 4న వివాహ పంచమి కావడంతో అదే రోజున కృష్ణుడి ఆలయంలో విగ్రహానికి, శాలినికి పెళ్లి జరిపించారు. వివాహం అనంతరం శాలిని ఇప్పుడున్న ఇంట్లోనే ఉంటుందని ఆమె తండ్రి మున్నాలాల్ తెలిపారు. ఇంట్లో శాలినికి ఉన్న ప్రత్యేక గదిని ఓ ఆలయంలా మార్చారు.