ఫీజు పెండింగ్.. వార్షిక పరీక్షలకు ‘నో’, ఆ 227 మంది విద్యార్థుల పరిస్థితేంటి?
గుర్గావ్: స్కూలు ఫీజు బకాయిలు చెల్లించలేదన్న కారణంతో ఓ పాఠశాల యాజమాన్యం ఏకంగా 227 మంది విద్యార్థులను వార్షిక పరీక్షలు రాసేందుకు అనుమతించలేదు. అంతేకాదు, ఈ విషయాన్ని ఏకంగా డీఈవోకే ఓ లేఖ ద్వారా తెలియజేసింది. ఈ ఘటన ఘజియాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
ఘజియాబాద్ నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూలులో 1వ తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదువుతున్న 227 మంది విద్యార్థులు ఫీజు బకాయిలు చెల్లించలేదని వారు వార్షిక పరీక్షలు రాసేందుకు పాఠశాల యాజమాన్యం అనుమతి నిరాకరించింది.
తమ పాఠశాలలో చదువుతున్న 315 మంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని, వారికి తాము నోటీసులు ఇచ్చామని, దీంతో వారిలో 38 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారని మరో 277 మంది ఇంకా ఫీజు బకాయిలు చెల్లించలేదని ఢిల్లీ పబ్లిక్ స్కూలు యాజమాన్యం జిల్లా విద్యాశాఖాధికారికి ఏకంగా లేఖ రాసింది.
అయితే ఫీజు చెల్లించకపోయినా.. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 50 మంది విద్యార్థులను వార్షిక పరీక్షలకు అనుమతించామని, మరో 227 మంది విద్యార్థులను వార్షిక పరీక్షలు రాసేందుకు అనుమతించలేదని ఆ లేఖలో డీఈవోకు స్కూలు యాజమాన్యం వివరించింది.
మరోవైపు ఈ ఘటనపై ఆ 227 మంది విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్షిక పరీక్షలకు అనుమతించకుంటే తమ పిల్లల భవిష్యత్ ఏంకావాలని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటనపై విద్యాశాఖాధికారులు కూడా కదిలారు. ఓ కమిటీని నియమించి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. తాము ఫీజు బకాయి ఉన్నామని చెప్పి తమ పిల్లల్ని వార్షిక పరీక్షలకు అనుమతించక పోవడంపై కొందరు తల్లిదండ్రులు పంజాబ్, హర్యానా హైకోర్టును కూడా ఆశ్రయించారు.