వరద విలయం: ఈశాన్యంలో పోటెత్తిన వరదలు...23 మంది మృతి
ఈశాన్య భారతాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా అస్సాంలో పోటెత్తిన వరదలకు ఆరు మంది మృతి చెందారు. దీంతో అక్కడ సంభవించిన వరదలకు మృతి చెందిన వారి సంఖ్య 23కు చేరింది. ఆదివారం రోజునాటికి పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
అస్సాంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రం అతలా కుతలమైంది. జనజీవనం స్థంభించిపోయింది. అక్కడ కురుస్తున్న వర్షాలకు స్థానిక నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. మొత్తం 4లక్షల 50వేల మంది ప్రజలు వరద బారిన పడ్డారు. మూడుజిల్లాల్లో 5 మంది మృతి చెందినట్లు సమాచారం. అధికారులు వెల్లడించిన లెక్కల ప్రకారం ఒక్క కరీంగంజ్ ప్రాంతంలోనే 2లక్షల మంది వరదలతో తీవ్రంగా నష్టపోయారు.
ప్రస్తుతం జోర్హత్లోని నిమాటి ఘాట్ వద్ద బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. మణిపూర్లో కూడా నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని అక్కడ ప్రజలు అప్రమత్తతతో ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు నివేదికను పంపుతున్నారు. గతం వారం రోజులుగా కురిసిన వర్షాలకు సర్వం కోల్పోయిన వారికోసం తక్షణమే నిధులు విడుదల చేసి వారిని ఆదుకోవాలని బీరేన్ సింగ్ రాజ్నాథ్ను కోరారు.