షాకింగ్: విమానాశ్రయంలో 23 తుపాకులు పట్టివేత: అనుమతుల్లేకుండా విదేశాల నుంచి!
చెన్నై: ఉగ్రవాద దాడులు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరిస్తుండగా..మరోవంక- విమానాశ్రయంలో పెద్ద ఎత్తున తుపాకులు దొరకడం కలకలం రేపింది. అయిదు కాదు, పదీ కాదు.. ఏకంగా 23 తుపాకులను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఎలాంటి లైసెన్స్ గానీ, వాటిని తీసుకుని రావడానికి ఉద్దేశించిన అనుమతి పత్రాలు గానీ లేవు. వాటిని గుర్తించిన వెంటనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తుపాకులను తీసుకొచ్చిన ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని మధురై విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో మోడీ, అమిత్ షా, ధోవల్: విమానాశ్రయాలపై ఫిదాయీన్ల దాడులు: అనుమానాస్పద లేఖ
తమిళనాడుకే చెందిన అజ్మల్ ఖాన్, ఖలిక్ మహమ్మద్, ముళిప్పు అనే ముగ్గురు వ్యక్తులు స్పైస్ జెట్ విమానంలో దుబాయ్ నుంచి మధురైకి చేరుకున్నారు. వారి వెంట భారీ లగేజీ కనిపించింది. మధురై విమానాశ్రయంలో బ్యాగులను తనిఖీ చేస్తుండగా.. 23 తుపాకులు కనిపించాయి. దీనితో ఉలిక్కి పడ్డ కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాము షూటింగ్ ప్రాక్టీస్ కోసం వాటిని దుబాయ్ నుంచి తీసుకొచ్చినట్లు ముగ్గురు ప్రయాణికులు తెలిపారు. దీనికి సంబంధించిన అనుమతి పత్రాలు గానీ, ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే వివరాలు గానీ వారి వద్ద లభించలేదు. షూటింగ్ పోటీల్లో వినియోగించే తుపాకులనుగా అధికారులు నిర్ధారించారు.
నిజానికి- షూటింగ్ ప్రాక్టీస్ కోసం విదేశాల నుంచీ తుపాకులను కొనుగోలు చేయాల్సి వస్తే..భారత షూటింగ్ స్పోర్ట్స్ సమాఖ్య నుంచి అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా జరిగే ప్రక్రియ అది. అలాంటిదేమీ లేకుండా ఒకేసారి 23 తుపాకులను తీసుకుని రావడాన్ని విమానాశ్రయ అధికారులు తీవ్రంగా పరిగణించారు. ముగ్గురు ప్రయాణికులు కూడా తాము షూటింగ్ ప్రాక్టీస్ కోసం వాటిని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. వారు ఇచ్చిన సమాచారం ఎంతవరకు నిజమనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వారిని మధురై విమానాశ్రయం పోలీస్ స్టేషన్ అప్పగించారు.