కుమారస్వామి మంత్రి వర్గంలో 23 మంది, సీఎం సోదరుడు, డీకే శివకుమార్, జయమాల, హంగామా!
బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఇరు పార్టీలకు చెందిన 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం మద్యాహ్నం రాజ్ భవన్ లోని గ్లాస్ హౌస్ లో గవర్నర్ వాజుబాయ్ వాలా ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. సీఎం సోదరుడు, డీకే శివకుమార్, నటి జయమాల తదితరులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
కుటుంబ సభ్యులు
మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులతో కలిసి రాజ్ భవన్ చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
అభిమానుల ఉత్సాహం
కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన నాయకుల అనుచరులు, అభిమానులు రాజ్ భవన్ బయట సందడి చేశారు. తన అభిమాన నాయకులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సందర్బంగా భాణసంచా కాల్చి, మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు.
డీకే. శివకుమార్
ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఎదురుచూసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, కనకపుర నియోజక వర్గం ఎమ్మెల్యే డీకే. శివకుమార్ ఎట్టకేలకు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. డీకే. శివకుమార్ అనుచరులు పెద్ద ఎత్తున రాజ్ భవన్ చేరుకుని ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.
సీఎం సోదరుడు
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సోదరుడు హెచ్.డి. రేవణ్ణ, ఆర్ వీ. దేశ్ పాండే, బండప్ప కాశంపూర, చాముండేశ్వరి నియోజక వర్గంలో సిద్దరామయ్యను చిత్తుచిత్తుగా ఓడించిన జీటీ. దేవేగౌడ, కేజే. జార్జ్, డీసీ. తమ్మణ్ణ, కృష్ణభైరే గౌడ, ఎంసి. మనగూళి, ఎన్.హెచ్. శివశంకర్ రెడ్డి, ఎస్ఆర్. శ్రీనివాస్, రమేష్ జారకిహోళి, వెంకటరావ్ నాడేగౌడ, ప్రియాంక్ ఖార్గే, సీఎస్. పుట్టరాజు, యూటీ. ఖాదర్, ప్రముఖ నటి, ఎమ్మెల్సీ డాక్టర్ జయమాల, జమీర్ అహమ్మద్, సీఎస్. పుట్టరాజు, సా.రా. మహేష్, బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్. మహేష్, శివానంద పాటిల్, వెంకటరమణప్ప, రాజశేఖర్ బసవరాజ పాటిల్. సి. పుట్టరంగ శెట్టి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.