బీ అలర్ట్.. 24 గంటల భారత్ బంద్..ఏటీఎం సెంటర్లపై ఎఫెక్ట్..ఎందుకు చేస్తున్నారు? ఎంత మంది పాల్గొంటారు?
కొత్త సంవత్సరంలో మనం మెగా స్ట్రైక్ ను చూడబోతున్నాం. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ ట్రేడ్ యూనియన్లు ఒక రోజు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే దేశవ్యాప్త సమ్మె మొదలవుతుందని, గురువారం తెల్లవారేదాకా కొనసాగుతుందని యూనియన్ నేతలు తెలిపారు. కనీస వేతం అమలు, జీతాల పెంపు, సోషల్ సెక్యూరిటీ, వారానికి ఐదు రోజుల పనిదినాలు లాంటి 12 కీలక డిమాండ్ల సాధన కోసం కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెకు.. బ్యాంక్ ఉద్యోగ సంఘాలతోపాటు ఇతర యూనియన్లు, స్టూడెంట్లు మద్దతు పలికాయి. దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటారని అంచనా.
తామూ విధులు బహిష్కరిస్తున్నట్లు
భారత్ బంద్ కారణంగా బుధ, గురువారాల్లో పలు రకాల సేవలకు విఘాతం ఏర్పడుతుంది. ముఖ్యంగా రవాణా, బ్యాంకింగ్ వ్యవస్థలు ఎఫెక్ట్ అయ్యే అవకాశముంది. కార్మిక సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ కు మద్దతుగా తామూ విధులు బహిష్కరిస్తున్నట్లు ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఇండియా నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తదితర యూనియన్లు ప్రకటనలు విడుదల చేశాయి. దీంతో ప్రభుత్వ బ్యాంకుల్లో సేవలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎం సెంటర్లపైనా ఎఫెక్ట్ పడనుంది.
పొలిటికల్ పార్టీలు కూడా..
ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు శివసేన, డీఎంకే, అన్నాడీఎంకే, బీజేడీ సహా పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. అయితే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం సపోర్ట్ చేయడంలేదు. ప్రభుత్వ రంగ సంస్థల్లోని కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటే జీతాల కోత తప్పదని ఆమె వార్నింగ్ ఇచ్చారు.
సమ్మె చేస్తున్నది ఎవరంటే..
భారత్ బంద్ లో భాగం పంచుకుంటున్న ట్రేడ్ యూనియన్లలో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్టీయూసీ), ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ), హింద్ మజ్దూర్ సభ (హెచ్ఎంఎస్), సెంటర్ ఆప్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సీఐటీయూ), ఆల్ ఇండియా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ సెంటర్ (ఏఐయూటీయూసీ), , సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ (ఎస్ఈడబ్ల్యూఏ), ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ (టీయూసీసీ) తదితర సంఘాలున్నాయి.