24 గంటల్లో నాలుగు అత్యాచారాలు, అందులో గ్యాంగ్ రేప్ కూడా...
గుర్గావ్: గుర్గావ్ నగరం సురక్షితం కాదని మరో సారి తెలిసిపోయింది. కేవలం 24 గంటలలో నాలుగు అత్యాచారాలు, మూడు లైంగిక వేదింపులు జరిగాయని నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు మాత్రం నగరంలో శాంతి భద్రతలు బాగున్నాయని అంటున్నారు.
గర్గావ్ నగరంలో మహిళలకు పూర్తి రక్షణ ఉందని నగర పోలీసు కమిషనర్ నవదీప్ సింగ్ అంటున్నారు. బుధ, గురువారాలలో గుర్గావ్ లో మహిళ మీద జరిగిన అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసులు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
తరు ప్రాంతంలో నివాసం ఉంటున్న 34 సంవత్సరాల మహిళ మొబైల్ కు ఉద్యోగం ఉందంటూ మెసేజ్ వచ్చింది. తరువాత గుర్గావ్ లోని సదర్ బజార్ లోని గెస్ట్ హౌస్ లో ఇంటర్వూకు హాజరు కావాలని ఫోన్ చేసి చెప్పారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆ మహిళ గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్లింది.
అప్పటికే ఒక గదిలో ముగ్గురు యువకులు కూర్చుని ఉన్నారు. తరువాత డోర్ లాక్ చేసిన ముగ్గురు ఆమె మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఆమె రక్షించాలని పోలీసులకు మెసేజ్ పంపించారని తెలిసింది. చివరికి మహిళ మీద ముగ్గురు పదేపదే గ్యాంగ్ రేప్ చేశారు.
తరువాత ఆమెను తీసుకు వెళ్లి మన్సర్ బస్ స్టాండ్ దగ్గర రోడ్డు పక్కన వదిలి పెట్టి పరారైనారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెకు చికిత్స అందించి గెస్ట్ హౌస్ దగ్గరకు పిలుచుకుని వెళ్లారు. మహిళ మీద అత్యాచారం చేసిన ముగ్గురి వివరాలను పోలీసులు సేకరించారు.
అతేలి సమీపంలో నివాసం ఉంటున్న ఫాజు, వాసీం, మోంటు అనే నిందితులు అని గుర్తించారు. చక్కాపుర్ ప్రాంతంలో ఆటో డ్రైవర్ అతని భార్య (22), ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. తన భర్త ఇంటిలో లేని సమయంలో తన అత్త కుమారుడు తన మీద అత్యాచారం చేశాడని ఆటో డ్రైవర్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కనహీ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన 19 సంవత్సరాల యువతి నివాసం ఉంటున్నది. ఇంటిలో ఎవరు లేని సమయంలో కారు డ్రైవర్ తన మీద అత్యాచారం చేశాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే విధంగా గుర్గావ్ లో నివాసం ఉంటున్న మహిళ న్యాయవాది తనను రేప్ చేశారని కేసు నమోదు చేసింది.
మరో ముగ్గురు మహిళలు తమ మీద లైంగిక వేదింపులు జరిగాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎల్ఎఫ్, డీఎల్ఎఫ్-11,సెక్టార్ 29, సెక్టార్ 40 పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయ్యాయి. 7 కేసులలో పోలీసులు మాత్రం ఇద్దరిని అరెస్టు చేశారు.