జోక్గా అంటే నిజంగానే జరిగిపోయింది... ఒక్కరోజులో చేతికి రూ.12కోట్లు... దెబ్బకు లైఫ్ సెటిల్...
కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన 24 ఏళ్ల అనంతు విజయన్ లాటరీలో జాక్పాట్ కొట్టాడు. కేరళ ప్రభుత్వ ఓనమ్ బంపర్ లాటరీలో రూ.12కోట్లు గెలుచుకున్నాడు. నిన్నటి దాకా ఓ ఆలయంలో సాధారణ ఉద్యోగి అయిన విజయన్ జీవితం... ఈ లాటరీతో పూర్తిగా మారిపోనుంది.ఎర్నాకుళంలోని ఓ దేవాలయంలో క్లర్క్గా పనిచేస్తున్న విజయన్ గత నెల ఓ ఏజెంట్ ద్వారా 173964 నంబర్ గల లాటరీని కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించి ఆదివారం(సెప్టెంబర్ 20) సాయంత్రం లక్కీ డ్రా తీయడంతో అదృష్టం విజయన్ను వరించింది.
జోక్గా అంటే నిజంగానే జరిగింది...
విజయన్ మాట్లాడుతూ... 'లాటరీలో ప్రైజ్ మనీ గెలుచుకున్నవాని ఫోన్ వస్తే... ఎవరో కావాలనే ప్రాంక్ కాల్ చేసినట్లు భావించాను. కానీ ఆ తర్వాత వార్తల్లో నా లాటరీ టికెట్ నంబర్ చూసి ఆశ్చర్యపోయాను. ఆదివారం ఉదయమే నా స్నేహితులతో ఈసారి ఓనమ్ బంపర్ లాటరీ నాదేనని... ఈ దెబ్బతో నా జీవితమే మారిపోతుందని సరదాగా అన్నాను. కానీ నేను జోక్గా చెప్పిన మాట రాత్రికే నిజమైంది.' అని సంతోషం వ్యక్తం చేశాడు.
కష్టాల్లో ఉన్న సమయంలో...
సరైన సమయంలో తనకీ జాక్పాట్ తగిలిందని విజయన్ చెప్పాడు. కోవిడ్ 19 కారణంగా తన సోదరి ఉద్యోగం కోల్పోయిందని.. పెయింటర్ అయిన తన తండ్రికి కూడా పని లేకుండా పోయిందని అన్నాడు. కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఉన్న సమయంలో జాక్పాట్ తగలడంతో ఆ కష్టాలన్నీ త్వరలోనే తీరిపోనున్నాయి. ప్రైజ్ మనీతో మొదట ఎర్నాకుళంలో ఓ చిన్నపాటి ఇల్లు కొనుక్కొంటున్నానని చెప్పాడు. మరికొంత డబ్బుతో తన తండ్రితో కలిసి ఏదైనా వ్యాపారం పెడుతానని తెలిపాడు.
సెకండ్ ప్రైజ్ మనీ ఎవరికి...
తాను తరుచుగా లాటరీ టికెట్లు కొంటుంటాని గతంలో ఓసారి రూ.5వేలు వచ్చాయని చెప్పాడు. ఈసారి రూ.300 పెట్టి లాటరీ టికెట్ కొన్నట్లు చెప్పాడు. ఇక లాటరీలో సెకండ్ ప్రైజ్ మనీ రూ.1కోటి ఆరుగురు మహిళలకు తగిలింది. ఎలాగంటే... ఈ ఆరుగురు ఒక్కొక్కరు రూ.100 చొప్పున రెండు టికెట్లు కొనుగోలు చేశారు. ఆ డబ్బును అంతా కలిసి సమానంగా పంచుకోనున్నారు.
Recommended Video
లాటరీ ద్వారానే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం....
కేరళ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం లిక్కర్,లాటరీ నుంచే వస్తుంది. రాష్ట్రంలో దాదాపు ప్రతీరోజూ ఏదో ఒక లాటరీ ఉంటుంది. ఈ టికెట్లను విక్రయించేందుకు దాదాపు 35వేల మంది ఏజెంట్స్,1.5లక్షల మంది రిటైలర్ సెల్లర్స్ ఉంటారు. కేరళ ప్రభుత్వానికి కేవలం లాటరీ ద్వారానే ఏటా రూ.10వేల కోట్లు నుంచి రూ.12వేల కోట్లు సమకూరుతుంది. ఈ ఏడాది కరోనా కారణంగా 3 నెలల పాటు లాటరీలను నిలిపివేశారు. లాక్ డౌన్ సడలింపులతో ఇటీవల తిరిగి ప్రారంభమయ్యాయి.