భారత్ నుంచి కరోనా వ్యాక్సిన్ కోసం.. క్యూలో 25 దేశాలు.. ఫార్మసీ వరల్డ్గా మలిచే లక్ష్యం : విదేశాంగ మంత్రి
భారత్ ఇప్పటివరకూ 15 దేశాలకు కోవిడ్ 19 వ్యాక్సిన్ సప్లై చేసిందని... మరో 25 దేశాలు క్యూలో ఉన్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. భారత్ నుంచి వ్యాక్సిన్ను కోరుతున్న దేశాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించినట్లు తెలిపారు. ఇందులో మొదటి కేటగిరీ పేద దేశాలు కాగా... రెండో కేటగిరీలో భారత ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే వ్యాక్సిన్ కొనుగోలు చేసే దేశాలు ఉన్నట్లు తెలిపారు. మూడో కేటగిరీలో నేరుగా మాన్యుఫాక్చర్ సంస్థల నుంచే వ్యాక్సిన్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న దేశాలు ఉన్నాయన్నారు.
కరోనాపై పోరులో ప్రపంచ పటంలో భారత్ చేసిన కృషి కనిపిస్తోందన్నారు. కొన్ని పేద దేశాలకు భారత్ గ్రాంట్ బేసిస్ మీద వ్యాక్సిన్ సప్లై చేస్తోందని.. మరి కొన్ని దేశాలు మనం సూచించిన రేట్లకు వ్యాక్సిన్ కొనుగోలు చేస్తున్నాయని తెలిపారు. భారత్ను ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్గా మలచాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని జైశంకర్ పేర్కొన్నారు. మరో 25 దేశాలకు ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్లను సరఫరా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే ఆయా వ్యాక్సిన్ కంపెనీలు కూడా డిమాండ్కు తగినట్లు వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచుతున్నాయని అన్నారు.
కాగా, దేశవ్యాప్తంగా కేవలం 18 రోజుల్లోనే 41 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల మార్కును ఇంత త్వరగా చేరుకున్న దేశంగా భారత్ నిలిచిందని రెండు రోజుల క్రితం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇక ఇటీవలి బడ్జెట్ గురించి మాట్లాడిన విదేశాంగ మంత్రి జైశంకర్... కేంద్ర బడ్జెట్ ఆర్ధిక వ్యవస్ధకు ఊతమిచ్చేలా ఉందని, దీంతో అన్ని వర్గాలకూ మేలు జరుగుతుందని అన్నారు.కరోనాతో కుదేలైన దేశ ఆర్ధిక వ్యవస్ధను తిరిగి గాడిన పెట్టే లక్ష్యంతో ఈ బడ్జెట్కు రూపకల్పన చేశామన్నారు. ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించిన విషయాన్ని జై శంకర్ గుర్తుచేశారు. తాజా బడ్డెట్లో చేసిన ప్రతిపాదనల అమలతో దేశ ఆర్ధిక వృద్ధి వచ్చే ఆర్ధిక సంవత్సరానికి 11 శాతానికి చేరుతుందన్నారు.
బడ్డెట్లో ఈ ఏడాది కేటాయించిన 2.23 లక్షల కోట్లు గతేడాదితో పోలిస్తే 130 శాతం అధికమని జై శంకర్ తెలిపారు. అలాగే స్వచ్ఛమైన తాగునీరు కోసం ఉద్దేశించిన జల్ జీవన్ మిషన్ కోసం 2.08 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆయన గుర్తుచేశారు. 13 తయారీ రంగాలకు మౌలిక సదుపాయాల కోసం మరో 2 లక్షల కోట్లు కేటాయించామన్నారు.