25 మంది కిడ్నాప్: పీకలు కోసేశారు - నలుగురి హతం - ఐదుగురి విడుదల - మావోయస్టుల ఘాతుకం
మావోయిస్టు ప్రభావిత బస్తర్ డివిజన్ లో మరోసారి నెత్తురు పారింది. గ్రామాల్లో అభివృద్ధి పనులకు సహకరిస్తున్నారని, తమ కదలికలపై పోలీసులకు సమాచారం ఇస్తున్నారనే నెపంతో నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలోని మోటాపోల్, పునాసార్ గ్రామాలకు చెందిన 25 మంది గిరిజనులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. అందులో నలుగురిని అతి దారుణంగా గొంతుకోసి హతమార్చారు.
కరోనా విలయం: భారత్ ప్రపంచ రికార్డు - 9నెలల్లో ఇదే హయ్యెస్ట్ - బ్రెజిల్ను వెనక్కునెట్టేస్తూ..
ప్రజాకోర్టులో శిక్షలు అమలు..
బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్ పాల్, పూసునార్ గ్రామాలకు చెందిన 25 మంది గిరిజనులను మావోయిస్టులు మూడు రోజుల కిందట కిడ్నాప్ చేశారు. అడవుల్లోనే ప్రజాకోర్టు నిర్వహించి, నలుగురిని ఉద్యమ ద్రోహులుగా నిర్దారించారు. కాళ్లూ చేతులు కట్టేసి, పీకలు తెగ్గోసి అతి దారుణంగా వాళ్లను చంపేశారు. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.
ఇంకా 16 మంది చెరలోనే..
రెండు గ్రామాలకు చెందిన 25 మందిని కిడ్నాప్ చేసిన మావోయస్టులు.. అందులో నలుగురిని హతమొందించారు. మరో ఐదుగురిని చితకబాది విడిడిపెట్టారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఇంకా 16 మంది గిరిజనులు మావోయస్టుల చెరలోనే బందీలుగా ఉన్నారు. తన్నులు తిన్నవాళ్లు ఊళ్లకు చేరుకున్నాకగానీ జరిగింది చెప్పడంతో ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బస్తర్ ఐజీ వివరణ..
బీజాపూర్ జిల్లాల్లో మావోయస్టుల ఘాతుకంపై బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పాటిలింగం శనివారం మీడియాతో మాట్లాడుతూ.. హత్యకు గురైన నలుగురూ(పూనెం సాను, గోరె శీను, ఐతులు పూసనార్ కు చెందినవాళ్లని, మరో హతుడు భుస్కూది మెటాపల్ అని తెలిపారు. కాగా, మావోయస్టుల చెరలోని మిగతా 16 మందినీ విడిపించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నప్పటికీ, ఆ విషయాన్ని పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు.
ఆ రెండు గ్రామాల్లో భయం భయం..
మెట్ పాల్, పూసునార్ గ్రామాలకు చెందిన 25 మంది మావోయిస్టులు కిడ్నాప్ చేయడం, అందులో నలుగురిని హతమార్చడం, ఇప్పటికీ 16 మంది చెరలో ఉండటంతో ఏక్షణం ఎలాంటి వార్త వినాల్సివస్తుందోనని ఆ రెండు గ్రామాల ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. తాజా హింసతో కలిపి గడిచిన నెల రోజులుగా మావోయస్టుల చేతుల్లో బలైపోయినవారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. అందులో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు.
అమిత్ షాకు సీఎం లేఖ..
ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టు తీవ్రవాదాన్ని అణిచేసే క్రమంలో కేంద్రం నుంచి మరింత సహకారం కావాలని కోరుతూ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో మంచి ఫలితాలు వస్తున్నాయని, పనులు నిరాటంకంగా కొనసాగేలా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సి ఉందని, అందుకోసం అదనంగా ఇంకొన్ని సీఆర్పీఎఫ్ బెటాలియన్లను పంపాలని కేంద్ర హోం మంత్రిని సీఎం కోరారు. కిడ్నాప్, హత్యల ఉదంతం నేపథ్యంలో ఈ లేఖకు ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు..
Recommended Video
తెలంగాణలోనూ హై అలర్ట్..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా, వామపక్ష వాదం అణిచివేతకు వ్యతిరేకంగా మావోయిస్టులు ఉత్తర తెలంగాణ బంద్కు పిలుపునివ్వడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ నెల 3న గుండాల ఎన్కౌంటర్లో మావోయిస్టు నేత హరిభూషణ్ గన్మన్, యాక్షన్ టీం కమిటీ సభ్యుడుది దేవాల్ అలియాస్ శంకర్ హతం కావడం, అది బూటకపు ఎన్కౌంటర్ అంటూ మావోయిస్టులు లేఖ విడుదల చేయడం తెలిసిందే. నక్సల్స్ ప్రతీకార చర్యలకు దిగొచ్చన్న సమాచారంతో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని కీలకమైన ప్రాంతాల్లో పోలీస్ బృందాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.