కోర్కెలు తీర్చాల్సిందే: ఇన్స్పెక్టర్పై 25మంది మహిళా పోలీసుల ఫిర్యాదు
న్యూఢిల్లీ: మహిళలకు అండగా నిలవాల్సిన పోలీసు శాఖలోనే మహిళలకు రక్షణ లేకుండా పోతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇందుకు తాజాగా ఢిల్లీలో చోటు చేసుకున్న ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. ఢిల్లీ పోలీసు విభాగంలోని ఓ ఇన్స్పెక్టర్పై ఏకంగా 25మంది మహిళా పోలీసులు ఫిర్యాదు చేయడం గమనార్హం.
నాలుగు నెలల క్రితం ఓ మహిళా పోలీసు.. ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ విభాగంలో నియమించబడ్డారు. ఆమె తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడంటూ డీసీపీని ఆశ్రయించి ఆందోళన వ్యక్తం చేశారు. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కమిషన్ను ఆశ్రయించిందా మహిళా పోలీసు.
కాగా, ఆ తర్వాత ఇవే ఆరోపణలతో మరో 24మంది మహిళా పోలీసులు సదరు ఇన్స్పెక్టర్పై కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఇందులో కానిస్టేబుల్ స్థాయి నుంచి సబ్ ఇన్స్పెక్టర్ వరకు మహిళా అధికారులుండటం గమనార్హం. తన కోర్కెలు తీర్చాలని సదరు అధికారి వేధిస్తున్నాడని మహిళా పోలీసులు పేర్కొన్నారు.
తన కంటే కిందిస్థాయిలో ఉన్న మహిళా పోలీసులను సదరు ఇన్స్పెక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ఎదురుతిరిగితే ఇబ్బందులు తప్పవని కూడా అతడు వారిని బెదిరింపులకు గురిచేశాడని ఓ సీనియర్ అధికారి తెలిపారు. వారిని లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడని చెప్పారు.
బాధితల లైంగిక ఆరోపణలపై విజిలెన్స్ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారని, నేరం చేసినట్లు రుజువైతే సదరు ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకుంటామని ఆ అధికారి తెలిపారు.