గుర్గావ్లో యువతిపై నలుగురు గ్యాంగ్ రేప్... తలను గోడకేసి బాదిన దుండగులు... ఆస్పత్రిలో బాధితురాలు
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో దళిత(వాల్మీకి) యువతిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ దేశమంతా భగ్గుమంటున్న వేళ... మరిన్ని వరుస అత్యాచార ఘటనలు వెలుగుచూస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హత్రాస్ ఘటన తర్వాత ఉత్తరప్రదేశ్లోనే మరో నాలుగైదు అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. మధ్యప్రదేశ్,గుజరాత్లలోనూ గ్యాంగ్ రేప్ ఘటనలు బయటపడ్డాయి. తాజాగా ఢిల్లీలోనూ ఇలాంటి ఉదంతం వెలుగుచూసింది.
అసలేం జరిగింది....
గుర్గావ్లో ఓ 25 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచార సమయంలో బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమె తలను బలంగా గోడకేసి బాదారు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది.ఏసీపీ కరణ్ గోయల్ మాట్లాడుతూ... గుర్గావ్ డీఎల్ఎఫ్ ఫేస్-2లో శనివారం(అక్టోబర్ 3) అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగిందన్నారు. నలుగురు నిందితుల్లో ఒకరు శనివారం రాత్రి మొదట ఆమెను కలిసినట్లు చెప్పారు. గుర్గావ్లోని సికిందర్పూర్ మెట్రో స్టేషన్ వద్ద ఆ యువతిని కలిసిన అతను... ఆమెను వెంటపెట్టుకుని ఓ రియల్టర్ ఆఫీస్కు వెళ్లినట్లు తెలిపారు. అప్పటికే అక్కడ మరో ముగ్గురు నిందితులు వేచి వున్నారని... అంతా కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పారు.
ఆస్పత్రిలో చేర్చిన పోలీసులు...
ఈ క్రమంలో బాధితురాలు ప్రతిఘటించగా ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారని... తలను గోడకేసి బాదడటంతో లోతైన గాయమైందని తెలిపారు. అత్యాచారం తర్వాత నిందితులు అక్కడినుంచి పరారయ్యారని... బాధితులు ఏడుపు విన్న కాంప్లెక్స్ సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం ఇచ్చాడని చెప్పారు.దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను సివిల్ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. అయితే అక్కడ న్యూరో సర్జన్ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని... వాంగ్మూలం కూడా నమోదు చేశామని చెప్పారు.
Recommended Video
నిందితుల అరెస్ట్...
బాధితురాలు ఇచ్చిన సమాచారంతో నేరం జరిగిన కొద్ది గంటలకే నలుగురు నిందితులను పట్టుకున్నట్లు ఏసీపీ చెప్పారు. నిందితులను రంజన్ యాదవ్(23),పవన్(24),పంకజ్ కుమార్(26),గోవింద్ యాదవ్(20)లుగా గుర్తించారు. నిందితులంతా చక్కర్పూర్ గ్రామానికి చెందినవారని... బాధితురాలిపై అత్యాచారం జరిపిన రియల్ ఎస్టేట్ ఆఫీసులో రంజన్ హెల్పర్గా పనిచేస్తున్నాడని గుర్తించారు. మిగతా ముగ్గురు నిందితులు డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. నలుగురిపై సెక్షన్ 376D,సెక్షన్ 323,506ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ వెల్లడించారు.