259 మంది సభ్యులతో కమిటీ.. కేసీఆర్, జగన్, చంద్రబాబుకు చోటు, తెలుగువారు వీరే..
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 259 మంది సభ్యులతో ఉన్నత కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. 2022 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నందున.. ''ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'' పేరుతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇందులో పలువురు ప్రముఖులకు అవకాశం కల్పించారు. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, తెలంగాణ గవర్నర్ తమిళిసై, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో సహా అన్ని రాష్ట్రాల గవర్నర్లు, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా అన్ని రాష్ట్రాల సీఎంలు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు.
వీరితోపాటు ప్రముఖ దర్శకుడు జక్కన్న రాజమౌళి, క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, పీవీ సింధు, భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా, రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావు తదితర కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వివిధ కార్యక్రమాల రూపకల్పనపై కమిటీ మార్గదర్శకాలు అందజేస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కమిటీ ఈ నెల 8న తొలిసారి సమావేశం కాబోతుంది. అందులో పలువురు సభ్యుల ప్రతిపాదనలు వినిపించే అవకాశం ఉంది.