అజ్మల్ కసబ్ మటన్ బిర్యానీ అడగలేదు: ఉజ్వల్ నికం
జైపూర్: ముంబై ఉగ్రవాద దాడి నిందితుడు అజ్మల్ కసబ్ జైలులో ఎప్పుడూ కూడా మటన్ బిర్యానీ కావాలని అడగలేదని ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వాదనలు వినిపించిన ఉజ్వల్ నికం చెప్పారు. కసబ్ బిర్యానీ అడిగినట్లు వచ్చిన వార్తలు ఊహాగానాలు మాత్రమేనని ఆయన అన్నారు.
కసబ్ ఎప్పుడు కూడా మటన్ బిర్యానీ అడగలేదని, ప్రభుత్వం కూడా అతనికి బిర్యానీ పెట్టలేదని నికం అన్నారు. కౌంటర్ టెర్రరిజంపై జరిగిన అంతర్జాతీయ సదస్సు సందర్భంగా ఆయన శుక్రవారం ఆ విషయం చెప్పారు. కసబ్ దేహ భాషను మీడియా సూక్ష్మదృష్టితో పరిశీలించిందని, ఆ విషయం కసబ్కు తెలుసునని, ఒక రోజు కోర్టు రూంలో కసబ్ తల వంచుకుని కన్నీరు కార్చాడని ఆయన చెప్పారు.
అంతలోనే ఎలక్ట్రానిక్ మీడియా ఆ వార్తను పట్టేసి ప్రసారం చేసిందని, ఆ రోజు రక్షాబంధన్ పండుగ అని, దానిపై ప్యానెల్ చర్చ కూడా మీడియాలో ప్రారంభమైందని ఆయన చెప్పారు. సోదరి జ్ఞాపకాలతో కసబ్ ఉద్వేగానికి గురైందని కొంత మంది ఊహించారని, అతను ఉగ్రవాదేనా అనే సందేహం వెలిబుచ్చే దాకా కొంత మంది వెళ్లారని ఆయన అన్నారు.
ఆ విధమైన ఉద్వేగ వాతావారణాన్ని ఆపాల్సి ఉందని, దాన్ని ఆపడానికి జైలులో కసబ్ బిర్యానీ డిమాండ్ చేశాడని తాను మీడియాకు చెప్పానని నికం అన్నారు. తాను మీడియాతో ఆ విషయం చెప్పగానే దానిపై ప్యానెల్ చర్చలు మొదలయ్యాయని, నిజమేమిటంటే కసబ్ ఎప్పుడు కూడా జైలులో మటన్ బిర్యానీ అడగలేదని నికం అన్నారు.
ముంబై ఉగ్రవాద దాడి కేసులో కసబ్కు 2012 నవంబర్లో ఉరిశిక్ష విధించారు. 2008 నవంబర్లో ముంబైలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు మరణించారు.