భారత్కు ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి రానా..?
2008 ముంబై మారణహోమంకు సంబంధించిన కేసులో ప్రధాన సూత్రధారి తహ్వుర్ హుస్సేన్ రానా ప్రస్తుతం అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో దోషిగా తేలడంతో అమెరికా కోర్టు ఆయనకు 14 ఏళ్లు జైలు శిక్ష విదించింది. ఈ క్రమంలోనే విచారణ కోసం రానాను భారత్కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
రానాను విచారణ కోసం భారత్కు అప్పగించాల్సిందిగా ప్రస్తుతం భారత ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 2021తో రానా జైలు శిక్ష కాలం ముగుస్తుంది. అంతకంటే ముందే ఆయన్ను భారత్కు తీసుకొచ్చి విచారణ చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. 2009లో రానాను అమెరికా అధికారులు అరెస్టు చేయడం జరిగింది.
2008లో ముంబై మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబా ఉగ్రవాదులు 10 మంది అమాయకులపై తుపాకులతో విరుచుకుపడ్డారు. ఉన్మాదంతో పేట్రేగిపోయారు ఈ ఉగ్రమూకలు. ఇందులో 9 మంది ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టగా ప్రాణాలతో అజ్మల్ కసబ్ను పట్టుకున్నారు. అనంతరం కసబ్ను ఉరితీశారు.
ఇక 2009 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న రానా పాకిస్తాన్లో పుట్టి కెనడాలో సెటిల్ అయ్యాడు. ఒకవేళ అమెరికా భారత్ దేశాలు తమ ప్రాసెస్ను త్వరగా పూర్తి చేయని పక్షంలో అంటే 2021నాటికి పూర్తి చేయని పక్షంలో రానా విడుదలయ్యాక కెనడాకు వెళ్లే పరిస్థితి ఉంటుంది.అయితే గడువులోగే అన్ని ప్రక్రియలు పూర్తయి రానాను భారత్కు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మరో అమెరికా ఉన్నతాధికారి వెల్లడించారు. రానాకు భారత్కు అప్పగించడం ద్వారా ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని అమెరికా అధికారులు వెల్లడించారు.