26/11..ఉగ్రవాదంపై భారత్ తో కలిసి యూఎస్ పోరాటం..అమరుల స్మారక సభలో యూఎస్ వెల్లడి
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలోభారత్తో కలిసి నడవటానికి తమ దేశం నిశ్చయంగా ఉందని అమెరికా తెలిపింది . ఉగ్రవాదంపై వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో భారత దేశంతో కలిసి సాగుతామని యూఎస్ నొక్కి చెబుతోంది. బాధితులకు న్యాయం జరిగేలా ఉగ్రవాద సంస్థల పై పోరాటం సాగిస్తామని పేర్కొంది. ముంబైలో 2008లో నవంబర్ 26వ తేదీన, అంటే ఇదే రోజు జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో యూఎస్ పౌరులు కూడా మృతి చెందిన కారణంగా యూఎస్ ఈ వ్యాఖ్యలు చేసింది.
ఉగ్రవాదం పై ఇండియాతో కలిసి యూఎస్ పోరాటం .. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ప్రతినిధి కాలే బ్రౌన్
నేటికి ముంబై మారణహోమానికి పన్నెండు సంవత్సరాలు అయిన కారణంగా రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రాం ద్వారా, ఈ దారుణమైన దాడికి కారణమైన ఉగ్ర మూకను మట్టుపెట్టడానికి, బాధితులకు న్యాయం జరిగేలా చూడటానికి ప్రయత్నం చేస్తున్నామని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ప్రతినిధి కాలే బ్రౌన్ చెప్పారు. 26/11 ముంబై దాడి 12 వ వార్షికోత్సవం సందర్భంగా, నాటి మారణహోమాన్ని గుర్తు చేసుకున్న యూఎస్ అప్పుడు జరిగిన మారణహోమం లో ఆరుగురు అమెరికన్లు మృతి చెందినట్లుగా పేర్కొన్నారు . బాధితులకు న్యాయం జరిగేలా అమెరికా తన నిబద్ధతను కొనసాగిస్తుందని పునరుద్ఘాటించారు.
ముంబై ఉగ్ర దాడుల్లో ఆరుగురు యూఎస్ పౌరులు మృతి
మా భారతీయ భాగస్వాములతో కలిసి నిలబడి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢంగా పోరాటం సాగిస్తామన్నారు బ్రౌన్ .పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఇటి) కి చెందిన పది మంది ఉగ్రవాదులు ముంబై అంతటా నాలుగు రోజుల పాటు 12 చోట్ల కాల్పులు, బాంబు దాడులు జరిపారు. నవంబర్ 26, 2008 న ప్రారంభమైన ఈ దాడుల్లో ఆరుగురు అమెరికన్లు, తొమ్మిది మంది ఉగ్రవాదులు సహా 166 మంది మరణించారు మరియు వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు .
ఈ దాడుల వెనుక చాలా మందే... వారిని పట్టుకుంటే రివార్డ్
తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ (చాబాద్) హౌస్ మరియు ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైలు స్టేషన్ లక్ష్యంగా దాడులకు కారణమైన వ్యక్తుల గురించి సమాచారం కోసం రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రాం 5 మిలియన్ డాలర్ల వరకు రివార్డును అందిస్తోంది. ఈ ఘోరమైన ఉగ్ర దాడి వెనుక ముఖ్య సభ్యులు చాలామంది ఉన్నారని దానిపై దర్యాప్తు చురుకుగా కొనసాగుతూనే ఉందని యూఎస్ పేర్కొంది. ఈ ఉగ్రవాద చర్యకు బాధ్యత వహించే లష్కరే తోయిబాకు చెందిన వారిని పట్టుకుంటే ఈ రివార్డ్ వస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది.
యుఎస్ కాపిటల్ ముందు స్మారక సభ
26/11 దాడుల సమయంలో మరణించిన ఆరుగురు యుఎస్ పౌరులు బెన్ జియాన్ క్రోమన్, గావ్రియేల్ హోల్ట్జ్బర్గ్, సందీప్ జెస్వానీ, ఆర్య లీబిష్ టీటెల్బామ్, అలాన్ షెర్ర్ మరియు అతని కుమార్తె నయోమి షెర్ర్. పాకిస్తాన్-అమెరికన్ డేవిడ్ కోల్మన్ హెడ్లీ మరియు మాజీ పాకిస్తాన్ ఆర్మీ వైద్యుడు మరియు ప్రస్తుతం కెనడా పౌరుడు తహవూర్ రానా, ఎల్ఇటి ఉగ్రవాద ఆపరేషన్ కు మద్దతు ఇచ్చినందుకు యుఎస్ కోర్టులో ఇప్పటికే అభియోగాలు మోపారు. ఇదిలావుండగా, ముంబై ఉగ్రవాద దాడుల అమరులకు నివాళులర్పించడానికి భారత అమెరికన్లు బుధవారం యుఎస్ కాపిటల్ ముందు స్మారక సభను నిర్వహించారు.